పంచాయతీల్లో ఈ-ఆడిట్..
నిధుల వ్యయంపై పారదర్శకత కోసం కొత్త విధానం
అందరికీ తెలిసే అవకాశం
దుర్వినియోగానికి అడ్డుకట్ట
పెద్దపల్లి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ):గ్రామ పంచాయతీలు పారదర్శక పాలన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. ఆదాయ, వ్యయ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేలా ఈ ఆడిట్ విధానాన్ని అమలు చేయనున్నది. ఇక లెక్కలు పక్కాగా ఉండడమే కాకుండా ప్రజలందరూ సులువుగా తెలుసుకునే వీలు కలుగనున్నది.
గ్రామ పంచాయతీల్లో ఆదాయ, వ్యయాలపై పారదర్శకత పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇకపై ఖర్చులు, జమల వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఎటువంటి దాపరికానికి తావు లేకుండా అన్ని రకాల నిధుల వివరాలను ఈ-ఆడిట్తో ప్రజలు ఇక సులువుగా తెలుసుకునే వీలు కలుగనున్నది. ఈ ఏడాది జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ-ఆడిట్ విధానం అమలు చేస్తున్నారు. జిల్లాలో 267 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది అన్ని పంచాయతీల్లో ఈ-ఆడిట్ విధానం అమలు చేస్తున్నారు. గత ఏడాది 40శాతం గ్రామ పంచాయతీలలో ఈ పరిస్థితిని అమలు చేశారు. అది మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ ఏడాది వందశాతం ఈ ఆడిట్ కోసం అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో సెప్టెంబర్ 15వరకు 255 గ్రామ పంచాయతీల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినట్టు ఆడిట్ అధికారులు తెలిపారు. 95శాతం ఈ ఆడిట్ ప్రక్రియ జిల్లాలో పూర్తయింది. మిగిలిన పంచాయతీల్లో సెప్టెంబర్ ఆఖరి వరకు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్లైన్లో కూడా నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. జూన్లో మొదలైన ఈ-ఆడిట్ ప్రక్రియ అక్టోబర్ కల్లా పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆడిట్ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లే పనిలో నిమగ్నమయ్యారు.
తెరిచిన పుస్తకంలా లెక్కలు..
ఈ ఆన్లైన్ ఆడిట్ విధానంతో నిధుల వినియోగం, సమాచారం జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులకు మాత్రమే తెలిసే పరిస్థితి ఉండేది. కానీ ఈ-ఆడిట్ విధానంతో ఎలాంటి దాపరికాలకు తావులేకుండా నిధుల వ్యయం ప్రజలకు తెలియనుంది. ప్రతీ లెక్కా తెరిచిన పుస్తకంలా కనిపిస్తుంది. అన్ని శాఖల్లోనూ ఈ విధానం అమలులోకి తీసుకురానున్నారు.
దుర్వినియోగం కాకుండా కట్టడి..
ఈ -ఆడిట్ విధానం అమల్లోకి వస్తే ఆడిట్ అభ్యంతరాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుండడంతో నిధులు దారి మళ్లించినా, దుర్వినియోగం చేసినా ప్రజలకు వెంటనే తెలిసే అవకాశం ఉంటుంది. కొంతవరకైనా అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.
అన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తాం..
గ్రామ పంచాయతీల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ-ఆడిట్ విధానాన్ని తీసుకువచ్చింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది అమలు చేస్తున్నాం. నిధుల జమ, ఖర్చుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తాం. దీంతో పంచాయతీల్లో పారదర్శకత పెరుగుతుంది. ఆడిట్ అధికారులు ఆన్లైన్లో నమోదు చేసిన జమ, ఖర్చుల్లో అభ్యంతరాలుంటే వాటికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో వెంటనే ఫిర్యాదు చేయాలి. దీంతో సరి చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాంటివి మా దృష్టికి తీసుకురావాలి.
-చంద్రమౌళి, డీపీఓ పెద్దపల్లి