ఆడబిడ్డల పేరుపైనే డబుల్బెడ్రూం ఇండ్లు
ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కేసీఆర్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ
హుజూరాబాద్టౌన్, జూన్ 14: ఎంతో మం ది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వ పథకాలను కొందరు నాయకులు పరిగె అంటున్నారని, అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆ పథకాలు ఉపయోగపడుతున్నా యా..? లేదా..?అవి ఉండాలా.. వద్దా..? మీరు తేల్చాలని అడుగగా, మహిళలంతా వాటిని కొనసాగించాలని చెయ్యి పైకెత్తి మద్దతు తెలిపారు. హుజూరాబాద్ పట్టణంలోని ‘సాయిరూప’ ఫంక్షన్ హాల్లో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై, హుజూరాబాద్ మండలంలోని 260 మంది లబ్ధిదారులకు 2కోట్ల 60 లక్షల 30వేల160 విలువైన చెక్కులను అందచేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటూ, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి దేశంలో ఎందరో ప్రధానులు మారారని, రాష్ట్రం లో ఎందరో ముఖ్యమంత్రులు మారారు కానీ, మనింటి ఆడబిడ్డ కన్నీళ్లు తుడవలేదని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అయ్యాకే ఆడబిడ్డలకు అం డగా నిలుస్తున్నారని చెప్పారు. ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లక్షా నూటపదహార్లు అందజేస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారని కొనియాడారు. ఈ సాయంతో ఎన్నో ఇండ్లు నవ్వుతున్నాయని, ఇల్లు నవ్వితే పల్లె, పల్లెనవ్వితే తెలంగాణ, తెలంగాణ నవ్వుతుంటే సీఎం కేసీఆర్ సంతోషపడతారన్నా రు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ లో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. రైతుబంధు, రైతు బీమాతో అన్నదాతలను ఆదుకుంటున్నారని, ఎండకాలంలో మత్తళ్లు దూకించిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే చెందుతుందని కొనియాడారు. త్వరలో ఆడబిడ్డల పేరున డబుల్ బెడ్రూం ఇండ్లను అందిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలకు డబ్బుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇంతటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, వాటి నుంచి లబ్ధి పొందుతున్న మనందరం ఆశీర్వదించాలని కోరారు. బడుగు వర్గానికి చెందిన తనకు బీసీ మంత్రిత్వశాఖను కేటాయించినందుకు, అద్భుత పథకాలతో బీసీలకు అండగా నిలుస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గందె రాధిక-శ్రీనివాస్ మంత్రి గంగుల కమలాకర్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, వైస్ ఎంపీపీ రమేశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బర్మావత్ రమ, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్రెడ్డి, ఆర్డీవో రవీందర్రెడ్డి, ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, తహసీల్దార్ ఎల్ రాంరెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.