సీఎంను, ప్రభుత్వాన్ని బదనాం చేయడమే ఈటల ఎజెండా
సంక్షేమ పథకాలపై గడపగడపకూ తిరిగి ప్రచారం చేయాలి
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్
టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం
హుజూరాబాద్ రూరల్, జూలై 13: రానున్న హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎగిరేది గులాబీ జెండానే అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ధర్మరాజుపల్లి, పెద్దపాపయ్యపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉప ఎన్నికకు కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈటల టీఆర్ఎస్లోకి మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోయాడని, ఆయన వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ క్యాడర్ పార్టీతోనే ఉందని, సీఎం కేసీఆర్ బీఫాం ఇచ్చిన అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2004 వరకు హుజూరాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ ఎవరో కూడా తెలియదన్నారు. 2009 ఎన్నికల్లో కెప్టెన్ లక్ష్మీకాంతారావు, 2014, 2018 ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసింది తామేనని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ను, తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడమే ఈటల ఎజెండాగా పెట్టుకున్నారని, అందుకే పదవి నుంచి ఆయనను భర్తరఫ్ చేశారని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని కొనియాడారు. సంక్షేమ పథకాలపై గడపగడపకూ తిరిగి ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. లబ్ధిదారులు టీఆర్ఎస్కు ఓటు వేసేలా అభ్యర్థించాలన్నారు. గ్రామాల్లో బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు చొల్లేటి కిషన్రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, సింగిల్విండో చైర్మన్ ఎడవెళ్లి కొండల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ కంకణాల విజయారెడ్డి, సర్పంచ్ రజిత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు సరిగా లేకపోయేవి. నేడు సీఎం కేసీఆర్ గ్రామాలకు నేరుగా నిధులు ఇస్తుండడంతో వాడవాడనా సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటవుతున్నాయి. గ్రామం మరింత అభివృద్ధి సాధించాలంటే గ్రామస్తులందరం టీఆర్ఎస్కు అండగా ఉండాలి. వచ్చే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి.
–వంగపండ్ల సమ్మయ్య, ధర్మరాజుపల్లి టీఆర్ఎస్ గ్రామ అడ్హక్ కమిటీ అధ్యక్షుడు (హుజూరాబాద్టౌన్)
కుల వృత్తులకు చేయూత
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కుల వృత్తులను ప్రత్యేకంగా గుర్తించింది. అన్ని కులాల వారికి అవసరమైన పనిముట్లు, సబ్సిడీ రుణాలతో చేయూతనందిస్తున్నది. కుల వృత్తితో కుటుంబాలను పోషించుకుంటున్న లక్షలాది మందికి టీఆర్ఎస్పై ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే శక్తివంచన లేకుండా కృషి చేస్తా.