బాలికలకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు కస్తూర్బా గాంధీ విద్యాలయాలను కార్పొరేట్ హంగులు కల్పిస్తున్నది. సువిశాలమైన తరగతి గదులు, సైన్స్ల్యాబ్లు, గ్రంథాలయాలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్వోఆర్ ప్లాంట్ల ద్వారా సురక్షితమైన తాగునీరు, సోలార్ సిస్టం ద్వారా వేడినీటి సౌకర్యం, నిత్యం నాణ్యమైన భోజనం పెడుతూ వారి పురోభివృద్ధికి కృషి చేస్తున్నది. ఉచితంగా యూనిఫాంలు, షూస్, బ్లాంకెట్లు, బుక్స్ అందిస్తూ బాలికల ఉజ్వల భవితకు బాటలు వేస్తున్నది.
తెలంగాణ చౌక్, మే 18 : బాలికా చదువు కోసం రాష్ట్ర సర్కారు మహాత్మా కస్తూర్బాగాంధీ పాఠశాలలను ఏర్పాటు చేసింది. అందులో అన్ని వసతులు కల్పించింది. ఈ నేపథ్యంలో ఎందరో నిరుపేద పిల్లలు ఈ విద్యాలయాల్లో చదువుకుంటూ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతస్థాయికి ఎదుగుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 13 కేజీబీవీ పాఠశాలలు ఉండగా అందులో ఐదు స్కూళ్లు ఇంటర్కు అప్గ్రెడ్ అయ్యాయి. వీటిలో తంగళ్లపల్లి, గంభీరావుపేట పాఠశాలల్లో నర్సింగ్, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు, కాగా మర్రిపల్లి, వీర్నపల్లి, సిరిసిల్ల కేజీబీవీలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు ప్రవేశపెట్టారు.
ఈ విద్యాలయాల్లో 3200 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. స్కూళ్లల్లో 6వ తరగతి, ఇతర క్లాస్ల్లో బ్యాక్లాగ్, ఇంటర్ అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఇప్పటికే అన్ని కేజీబీవీలల్లో అడ్మిషన్లు ఫుల్ అయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కేజీబీవీలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో పాటు ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని ఈ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రస్తుతం కేజీబీవీ విద్యాలయాలు విద్యార్థినులతో కళకళలాడుతున్నాయి.
ఆరోగ్యానికి పౌష్టికాహారం..
బాలికల అభ్యున్నతికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కేజీబీవీలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. బాలికల్లో రక్తహీనత, ఇతర సమస్యలను అధిగమించడం కోసం ప్రతి రోజు ఉదయం రాగి జావ, మొలకెత్తిన విత్తనాలు, వారంలో ఆరు రోజుల పాటు గుడ్లు, నెలలో నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్తో పాటుగా పోషక విలువతో కూడిన ఆహారం అందిస్తున్నారు. ఉచితంగా రెండు జతల యూనిఫాం, నోట్ పుస్తకాలు, రెండు బ్లాంకెట్లు, కార్పెట్, షూస్, ఉదయం సాయంత్రం సమయంలో స్నాక్స్, సోలర్సిస్టమ్ ద్వారా వేడినీటి సౌకర్యం, ఆర్వో ప్లాంట్స్ను ఏర్పాటు చేసి సురక్షితమైన తాగునీరు ఇలా ఇంటిని మైమరపించే సౌకర్యాలతో పాటు అలాగే విశాలమైన తరగతి గదులు, అర్హత అనుభవం గల ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యబోధన, సువిశాలమైన క్రీడాప్రాంగణం, సైన్స్ ల్యాబ్స్, ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి ప్రతి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధవహించి మెరుగైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి.
అందుబాటులో ఆంగ్లబోధన..
ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలల్లో గతేడాది నుంచి ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చింది. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్స్థాయి విద్యనందించే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పాఠశాలలోని ఎస్వోలకు సబ్జెక్టుల వారీగా టీచర్లకు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఉత్తమ ఫలితాలు..
కేజీబీవీ పాఠశాలల్లో నిత్యం మండల, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అందులో భాగంగా ఉదయం, సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో 9 కేజీబీవీ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా వ్యాప్తంగా 13 కేజీబీవీలలో 328 మంది విద్యార్థులు హాజరు కాగా 320 మంది ఉత్తీర్ణులయ్యారు. 9నుండి 10జీపీఏలను 100మంది విద్యార్థులు సాధించి జిల్లాలో 98శాతం ఉత్తీర్ణత సాధించారు.
సాధికారత కార్యక్రమాలు.
పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థుల సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దీనితో పాటుగా కంప్యూటర్ బోధన, టైలరింగ్, కుట్లు, అల్లికల శిక్షణ, యోగ, వ్యాయామం, బాలికల ఆత్మరక్షణ కోసం కరాటేలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఆయా సబ్జెక్టు నిపుణులు, సైకాలజిస్టుల ద్వారా మోటివేషన్ తరగతులు, సఖీ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థుల వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకొని వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెల రెండు సార్లు ఆర్బీఎస్కే బృందంతో విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
అడ్మిషన్లు ఫుల్ అయినవి..
పాఠశాలలో ఇంటర్ వరకు తరగతులు జరుగుతున్నాయి. ప్రసుత్తం 6 నుంచి 10వ తరగతి వరకు అన్ని క్లాసుల్లో ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థినులను తీసుకోవాల్సి ఉండగా అంతకు మించి అడ్మిషన్లు తీసుకున్నాం. గతేడాది పదవ తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్ కోసం అప్లయ్ చేసుకున్నారు. అర్హత, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో విద్యబోధన, బాలికలకు అనువైన మంచి సౌకర్యాలు కేజీబీవీల ప్రత్యేకత కావున ప్రతి విద్యాలయాలు విద్యార్థినులతో కళకళలాడుతున్నాయి.
– నీలిమ, కేజీబీవీ సెక్టోరియల్ ఆఫీసర్ (వీర్నపల్లి)
సౌకర్యాలు బాగున్నయ్..
ఇంటిని మరిపించేవిధంగా ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. విశాలమైన తరగతి గదులు, శుద్ధజలం, ఉదయం, సాయంత్రం స్నాక్స్, ప్రతి రోజు యోగ, ఆటల్లో రాణించేలా క్రీడాపోటీలు జరుగుతుంటాయి. మా టీచర్లు చాలా శ్రద్దతో ప్రతి రోజు స్టడీఅవర్స్ నిర్వహిసూ వెనకబడిన విద్యార్థినిలపై దృష్టిసారించి అన్ని విధాలుగా ప్రోత్సహన్ని అందిస్తారు. నాణ్యమైన బోధన అందిస్తూ మాలాంటి నిరుపేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలకు దీటైన విద్యను అందిస్తూన్నారు.
– మధుషా, 7వ తరగతి (వీర్నపల్లి కేజీబీవీ)
చక్కటి ఆదరణ లభిస్తున్నది.
కస్తూర్బా పాఠశాలలకు చక్కటి ఆదరణ లభిస్తున్నది. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో బాలికల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా కస్తూర్బా విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించింది. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం బోధన, బాలికల సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థినులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండేందుకు కరాటే, యోగా శిక్షణ ఇప్పిస్తున్నాం.
– పద్మజ, సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్