కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ ఉద్యోగాల హవా నడుస్తోంది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలతో హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకు పోతుండగా.. ఇదే విధంగా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. ఇందులో భాగంగా కరీంనగర్ శివారులోని ఉజ్వల పార్కు వద్ద 2018 జనవరి 8న 34 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అతి తక్కువ సమయంలో పూర్తి చేయడమే గాకుండా, హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కంపెనీలను తలదన్నే విధంగా సౌకర్యాలు కల్పించడంతో పలు కంపెనీలు ఎంవోయూ కుదుర్చుకుని స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాయి. ప్రస్తుతం ఇందులో 12 కంపెనీలు కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా, 600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మరో వైపు 150 మందితో టాస్క్ శిక్షణ కేంద్రం కొనసాగుతున్నది.
– కమాన్చౌరస్తా, నవంబర్ 19
కమాన్చౌరస్తా, నవంబర్ 19: గతంలో ఐటీ అంటే బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే నగరాలే కనిపించేవి. కానీ, స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఐటీ రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది. అంతే కాకుండా, ఐటీని రెండో స్థాయి నగరాలకు విస్తరింపజేయాలని సీఎం కేసీఆర్తో పాటు, మంత్రి కేటీఆర్ భావించారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కృషితో కరీంనగర్కు ఐటీ టవర్ కేటాయించారు. దీనిని 2020, జూలై 21న ప్రారంభించగా, 12 సంస్థల్లో దాదాపు 600 మంది వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. వీటితోపాటు ఇందులో నిర్వహిస్తున్న తెలంగాణ అకాడమీ ఫర్ నాలెడ్జ్ అండ్ స్కిల్(టాస్క్) కేంద్రంలో సైతం దాదాపు 150 మంది అభ్యర్థులు శిక్షణ పొందుతూ దేశ వ్యాప్తంగా వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు.
2020 జూలైలో ప్రారంభమైన ఐటీ టవర్లో ప్రస్తుతం 12 సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో వీటా, టీం అప్, సృజనా కన్సల్టెన్సీ, అర్బన్ టెక్ సర్వీసెస్, సంస్కృతి, ట్రెస్సీస్, క్లస్టర్ ఐటీ, ఆస్సైక్టెసైట్స్, అన్నెక్స్ ఆక్, ఈఎక్స్ఎం 10, అలీ అన్సార్సీ టెక్నాలజీస్, ఎస్ఆర్కే టెక్నాలజీస్ సంస్థలు కొనసాగుతుండగా, ఇందులో సంస్థను బట్టి దాదాపు 400 మంది కార్యాలయంలో, వర్క్ఫ్రం హోంలో 200 మంది వరకు ఉద్యోగాలు చేస్తున్నారు.
ఐటీ టవర్ను 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల్లో (జీ ప్లస్ 5) నిర్మించారు. ఒక్కో ఫ్లోర్ సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఉండగా, అధునాతన సౌకర్యాలు కల్పించారు. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో కంపెనీలకు స్థలం కేటాయిస్తున్నారు. ఇందులో వివిధ కంపెనీలు ఎంపిక చేసే యువతకు శిక్షణ ఇచ్చేందుకు 1900 చదరపు అడుగుల వైశాల్యంతో లర్నింగ్ సెంటర్ను సిద్ధంగా ఉంచారు. ఈ టవర్లో సమాచారం తెలుసుకునేందుకు రిసెప్షన్ లాబీని ఏర్పాటు చేశారు. 1500, అలాగే 3 వేల చదరపు అడుగులతో క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఏసీ సౌకర్యాన్ని కల్పించారు. ఒక్కో లిఫ్టులో ఒకేసారి 13 మంది వెళ్లి వచ్చేలా రెండు లిఫ్టులు పెట్టించారు.
బీటెక్ అయిపోగానే ఎలాంటి ఉద్యోగం చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ, నేను అలా అనుకోలేదు. కరీంనగర్లో నాలాంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నా. ఇదే క్రమంలో నా మిత్రుడు ప్రణయ్తో కలిసి అర్బన్ టెక్ సర్వీసెస్ను 2019లో మొదలు పెట్టాం. 2021లో కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభించిన తర్వాత అందులో స్పేస్ తీసుకుని మా సేవలు చాలా విస్తరించాం. కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభించడం మాకెంతో కలిసి వచ్చింది. మా సంస్థ ద్వారా ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్, ఏపీఐ ఇంటిగ్రేషన్స్ అండ్ ఏఐ ఆటోమేషన్ సర్వీసెస్ను అందిస్తున్నాం. ఈ క్రమంలో అనతి కాలంలోనే రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు టర్నోవర్ అందించే స్థాయికి వచ్చాం. రెండో స్థాయి నగరాలకు ఐటీని విస్తరింపజేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక మంత్రి గంగుల ఆలోచనలకు హ్యాట్సాఫ్.
-గట్టిగొప్పుల పవన్ కుమార్, సీఈవో, అర్బన్ టెక్, సర్వీసెస్
నేను పుట్టి పెరిగింది మొత్తం కరీంనగర్లోనే. ఇక్కడి రాంనగర్ హైస్కూల్ పదో తరగతి వరకు, అల్ఫోర్స్లో ఇంటర్, శ్రీచైతన్య కళాశాలలో బీటెక్ పూర్తి చేశా. అదే క్రమంలో కంపెనీ మొదలు పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఇదే క్రమంలో కరీంనగర్లో ఐటీ టవర్ మొదలవడంతో స్థానికులకు ఉద్యోగాలు కల్పించిన వారం అవుతామన్న ఆలోచనతో అర్బన్ సర్వీసెస్ సంస్థను నా మిత్రుడు పవన్తో కలిసి స్థాపించాం. దీని ద్వారా మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ సేవలను నేరుగా అందిస్తున్నాం. కరీంనగర్లో ఇలాంటి ఒక సంస్థ నడుస్తుండడం, ఇందులో మన ప్రాంతానికి చెందిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా గర్వంగా ఉంది. మా సంస్థలో ప్రస్తుతం 20 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు 120 మంది స్థానికంగా పని నేర్చుకుని, దేశవ్యాప్తంగా ఉన్న చాలా ఎంఎన్సీ సంస్థల్లో ఉద్యోగాల చేయడానికి అర్హత సాధించారు. ప్రభుత్వం మా లాంటి స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడం వల్ల ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి.
– ప్రణయ్ కుమార్ ఎనగంటి, డైరెక్టర్, అర్బన్ టెక్
మాది సిరిసిల్ల. నేను డిగ్రీ వరకు కరీంనగర్, సిరిసిల్లలోనే చదివా. మాస్టర్స్ నెదర్లాండ్లో పూర్తి చేశా. ఈ క్రమంలో టెక్నికల్ సపోర్ట్ ఆప్ డెవలప్మెంట్స్కు మన దేశంలో మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్లో సంస్థను ప్రారంభించి సేవలు అందిస్తున్నాం. ఇదే క్రమంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఐటీ సేవలను ప్రారంభించాలనే సంకల్పంలో మేం సైతం భాగస్వాములవ్వాలని ముందుకు వచ్చాం. ఇందులో భాగంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లో వర్క్ స్పేస్ను తీసుకుని స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాం. ఇందులో టెక్నికల్ సర్వీసెస్ అందిస్తున్నాం. ఇప్పటి వరకు 35 మందికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాం. అలాగే, ఐటీ కన్సల్టెంట్గా వ్యవహరిస్తూ వివిధ సంస్థలకు వర్క్ ప్రాసెసింగ్ చేస్తూ స్థానిక యువతకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
– అనుగుల శరత్ కుమార్, సృజనా కన్సల్టెన్సీ, సీఈవో
2021 నుంచి కరీంనగర్లో ప్రారంభమైన ఐటీ టవర్లో స్టార్టప్గా మా సంస్థను ప్రారంభించాం. అప్పటి నుంచి 30 నుంచి 40 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ, తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్ట్లకు సైతం సేవలందిస్తున్నాం. ఇప్పటి వరకు కరీంనగర్లో అందించిన సేవలను విస్తరింపజేస్తూ, ప్రస్తుతం సిద్దిపేటలోని ఐటీ టవర్లోనూ సంస్థను ప్రారంభించాం. ఇక్కడ 15 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మరో 40 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ పోటీ పరీక్షల సమయంలో అప్పటి కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సహకారంతో వారధి అప్లికేషన్ను డెవలప్ చేశాం. దీనిని తెలంగాణకు చెందిన లక్ష మంది వరకు వాడుతున్నారు. అలాగే, సిద్ధిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సహకారంతో ‘రుతు ప్రేమ’ అప్లికేషన్ను ప్రారంభించాం. ఇదంతా కరీంనగర్ ఐటీ టవర్తోనే సాధ్యమైంది.
– చైతన్య, సీఈవో, టీం అప్
అన్నెక్స్ఆక్ సంస్థ పూర్తిగా అమెరికాకు చెందినది. ఇందులో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కరీంనగర్లో స్థానిక నాయకుల సహకారంతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. ఇందులో దాదాపు 20 మంది యువతీయువకులు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే, వర్క్ఫ్రం హోంలో 20 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. దీని ద్వారా ఎస్ఏపీ, ఫైనాన్స్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇలా చాలా సర్వీసెస్లో ఉద్యోగాలు అందిస్తున్నాం. ఇక్కడ యువతలో చాలా వృత్తి నైపుణ్యాలున్నాయి. వాటిని వెలికి తీసి ఉద్యోగాల్లో రాణించేలా చేస్తున్నాం. ఇక్కడ ప్రతిభ చూపిన ఉద్యోగులను వివిధ ప్రాంతాల్లో ఉన్న మా సంస్థల్లో ఉద్యోగాలకు సిఫార్సు చేస్తున్నాం.
– టీ వినోద్, మేనేజర్, అన్నెక్స్ఆక్