టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. రేపటి నుంచే ప్రారంభవుతుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు కుదించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాలను, రెండు ప్రైవేటు సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులు సౌకర్యంగా పరీక్షలు రాసేందుకు డ్యూయల్ డెస్క్లు, ఫ్యాన్స్, మంచి నీటి సౌకర్యం కల్పించగా, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు గ్రామీణ విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు నడుపుతున్నదని, హాల్ టికెట్ చూపితే ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. కాగా, జిల్లాలో 12,144 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 1 : పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగనుండగా, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు, సైన్స్ పరీక్ష మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 నిమిషాల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎండల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటితో పాటు విద్యుత్ సౌకర్యాలను కల్పించారు. ప్రతి కేంద్రం వద్ద ఏఎన్ఎంతో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన డ్యూయల్ డెస్క్లను ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్పై ప్రత్యేకమైన నిఘాపెట్టారు. పరీక్షకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు bse.telangana.gov.in వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్ చేసుకునే అవకాశం ఉన్నది.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివే 3121 మంది విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్లో పరీక్ష సామగ్రిని స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి జిల్లాను మొదటిస్థానంలో నిలుపాలని సూచించారు.
కరీంనగర్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీహెచ్వీఎస్ జనార్దన్రావు తెలిపారు. కాగా, జిల్లా వ్యాప్తంగా 76 పరీక్షా కేంద్రాలను, రెండు ప్రైవేటు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో 54, హుజురాబాద్ రెవెన్యూ డివిజన్లో 22 కేటాయించారు. బాలురు 6,359 మంది, బాలికలు 5,785 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 12,144 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు సుమారు 800 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. వీరు కాకుండా 76 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 76 మందిని డిపార్టుమెంటల్ అధికారులుగా నియమించారు. అలాగే, ఇద్దరు డిపార్ట్మెంట్ అధికారులను, మాస్ కాపీయింగ్ను నిరోధించడానికి ఐదుగు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎంఈవోపాటు ఒక రెవెన్యూ, పోలీసు అధికారులతో సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు రాష్ట్ర పరిశీలకులు ఒకరు ఉంటారు. విద్యార్థులను మొదటి రోజు పరీక్షా సమయం మించిన తర్వాత 5 నిముషాల వరకు అనుమతించనున్నట్లు డీఈవో చెప్పారు. ఏవైనా ఫిర్యాదులంటే డీఇవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 70133 53090కు సమాచారం ఇవ్వాలి. సదరు ఫిర్యాదును బట్టి వెంటనే స్పందిస్తారు.
జగిత్యాల జిల్లాలో పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి జగన్మోహన్రెడ్డి తెలిపారు. కాగా, పరీక్షలకు 5747 మంది బాలురు, 5430 మంది బాలికలు కలిపి మొత్తం 11,177 మంది హాజరుకానుండగా, రెగ్యులర్ విద్యార్థుల కోసం 68, ఒకటి ప్రైవేటు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 69 చీఫ్ సూపరింటెండెంట్లు, 69 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 3 అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, 420 మంది ఫ్లైయింగ్ స్కార్ట్స్, 980 మంది ఇన్విజిలేటర్స్ను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి జిల్లాలో పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డీ మాధవి తెలిపారు. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 7,937 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎవరికైనా సమస్యలు, సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 86398-62145 ఫోన్ చేసి తెలియజేయాలని డీఈవో సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఏ రమేశ్కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, 6496 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో 3109 మంది బాలురు, 3387 మంది బాలికలు ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలో 8 కేంద్రాలు, వేములవాడ పట్టణంలో 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 16 మంది సప్లిమెంటరీ విద్యార్థులకు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక డీవోను నియమించినట్లు డీఈవో తెలిపారు. పరీక్షలు నిర్వహణ కోసం 36 మంది సీఎస్లు, డీవోలు, 8 మంది రూట్ ఆఫీసర్స్, సిట్టింగ్ స్కాడ్ బృందాలు, రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలును ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ 9866854677 అందుబాటులో ఉంచారు. కాగా, జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను డీఈవో శనివారం పరిశీలించారు.