వీణవంకలో నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు
అభివృద్ధిపై టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
వీణవంక, జూన్ 7 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం కిష్టంపేట గ్రామ ఫంక్షన్ హాల్లో సర్పంచులు, టీఆర్ఎస్ ఎంపీటీసీలు, ముఖ్య నాయకులతో మండల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, ఇంకా అవసరమైన, పెండింగ్లో ఉన్న పనులు, బిల్లులు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు గుర్తించి క్షేత్రస్థాయిలో వాటిని పూర్తి చేయాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని సూచించారు. అందరూ బాధ్యతాయుతంగా పని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి , ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్రావు, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, కో ఆప్షన్మెంబర్ హమీద్, మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.