కరీంనగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్ రూరల్ : ఈ నెల 30న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు వంటరూంలో సిలిండర్కు దండం పెట్టి వెళ్లి, టీఆర్ఎస్కు ఓటేసి బీజేపీని బొంద పెట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. అలా చేస్తేనే ఢిల్లీలోని బీజేపీ నేతలకు షాక్ తగలి, వంట గ్యాస్ ధర తగ్గిస్తారని చెప్పారు. హుజూరాబాద్ మండలంలోని కనుకులగిద్దె, జూపాక, బొత్తలపల్లి, ఇందిరానగర్- శాలపల్లి, రాంపూర్, రంగాపూర్, రాజాపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి మంత్రి విస్తృత ప్రచారం చేశారు. సాయంత్రం చెల్పూర్లో నిర్వహించిన ధూంధాంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ సంపదను సృష్టించి పేదలకు పంచుతోంటే.. కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం బడా బడా కంపెనీలకు ఇప్పటికే రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. ఈటల రాజేందర్ తన స్వార్థం కోసం ఆ పార్టీలో చేరి ఆయన అంటించుకున్న బురదను హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ అంటించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు.. ఎదిగిన కొడుకు తల్లి గుండెల మీద తన్నినట్లు.. తనకు అవకాశాలు కల్పించిన టీఆర్ఎస్ను మోసం చేశాడని ధ్వజమెత్తారు. బీజేపీ ధరలు పెంచి సామాన్యులను ఆగం చేస్తున్నా చోద్యం చూస్తున్నాడని దుయ్యబట్టారు. గ్యాస్ ధర రూ.500లకు తగ్గిస్తానని కేంద్ర మంత్రులతో ఈటల చెప్పించాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను మూడు వారాల్లో 16 సార్లు పెంచిన ఘనత కేంద్రంలోని బీజేపీదన్నారు. వీటి మూలంగా నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయన్నారు. ఇలాంటి పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ఇంకా రెండున్నరేండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని, నియోజకవర్గానికి ఏది చేయాలన్నా సీఎం కేసీఆరే చేస్తారని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే ఏం చేస్తామో చెబుతున్నామని, కానీ ఈటల రాజేందర్ మాత్రం నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ, తిట్ల దండకం మొదలు పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈటల గెలిస్తే ఏం చేస్తాడో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తాము రైతులకు ఇప్పటికే రూ.50 వేల పంట రుణాలు మాఫీ చేశామని, ఇంకా రూ.50 వేలు ఉగాది వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అదే బీజేపీ అభ్యర్థి ఈటల ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపించుకుంటే తాను ప్రతి పది హేను రోజులకోసారి హుజూరాబాద్కు వస్తానని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పారు. ఎప్పటిలాగే ఐకేపీ సెంటర్లు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
సర్పంచ్ తీర్మానం ఇవ్వకుంటే కలెక్టర్ వస్తడు
కనుకులగిద్దలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ‘గ్రామాభివృద్ధికి నిధులు కేటాయిస్తే స్థానిక సర్పంచ్ పనులకు తీర్మానం ఇస్తలేడట. ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ గెలిచిన వెంటనే గ్రామానికి కలెక్టర్ను తీసుకువస్త. సర్పంచ్ను తప్పించి ఉపసర్పంచ్తో తీర్మానాలు చేయించి అభివృద్ధి పనులు చేయిస్తం. గ్రామాభివృద్ధికి నిధులు ఎక్కువ కేటాయించాలని సర్పంచ్ అడగాలె. కానీ, ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న నిధులను అడ్డుకొని తీర్మానాలు ఇవ్వకుండా పనులు చేస్తలేరు. మేం చట్ట ప్రకారం పోయి గ్రామాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆకట్టుకున్న గ్యాస్ సిలిండర్ ప్రచారం
ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్రావు ప్రతి గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ను ప్రచార వాహనంపై ప్రదర్శించి పెరిగిన ధరలను మహిళలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఒకప్పుడు రూ.450 మాత్రమే ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు ఎంతయ్యిందని వారితోనే చెప్పించారు. రూ.1,040కి పెరిగిందని మహిళలు చెప్పారు. పండుగ పూట కూడా రూ.15 వడ్డించారని తెలిపారు. ఇంతేసి ధరలు పెంచుతున్న బీజేపీకి ఓట్లు ఎలా వేస్తారని మంత్రి ప్రశ్నించగా, ‘వేయం.. వేయం’ అని సమాధానాలు ఇచ్చారు.
నిర్లక్ష్యంగా మాట్లాడిండు..
మా సొంతూరు చెల్పూర్. మా గ్రామాన్ని ఈటల దత్తత తీసుకున్నడు. అది చేస్తా.. ఇది చేస్తా అన్నడు. కానీ, చేసిందేమీ లేదు. నిధులు మంజూరు చేయమని ఎన్నో సార్లు అడిగినం. పట్టించుకోలే. చాలా నిర్లక్ష్యంగా మాట్లాడిండు. ఏం చేయాలో అర్థం కాలె. గ్రామస్తులు రోజూ నా ఇంటికి వచ్చి ప్రశ్నించేవారు. అధికార పార్టీలో ఉండి ఏం పనులు చేస్తలేవని నిలదీసేవారు. చాలా బాధపడ్డ. కానీ మంత్రి హరీశ్రావును అడగ గానే రూ.4.40కోట్లు మంజూరు చేసిండు. చాలా సంతోషం. రాజేందర్ తన ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీలో చేరిండు. ఆయనకు ప్రజలంతా ఒక్కటై బుద్ధి చెప్పాలి.
టీఆర్ఎస్ వెంటే ముదిరాజ్లు
నా పేరు ముద్రవేణి రాజు. మేం తెనుగోళ్లం (ముదిరాజ్). మా మద్దతు టీఆర్ఎస్కే ఉంటది. మేం మొదటి నుంచి టీఆర్ఎస్లనే ఉన్నం. ఇప్పుడుసుతం టీఆర్ఎస్లనే ఉంటం. మా ముదిరాజ్లంతా ఈటలకు మద్దతు ఇస్తున్నరని అనుకోవద్దు. ఆయన టీఆర్ఎస్లో ఉన్నపుడు మేం టీఆర్ఎస్ల ఉన్నం. ఆయన పార్టీ మారిండు కానీ, మేం మారం. కేసీఆర్ చేయవట్టి రైతుబంధు వస్తంది. రైతు బీమా వస్తంది. కల్యాణలక్ష్మి వస్తంది. కేసీఆర్ కిట్ వస్తంది. నా పేరు మీద గుంట భూమి లేకుండె. కేసీఆర్ సార్ ధరణి పెట్టినంక పైస ఖర్సు లేకుంట ఐదెకరాలు నా పేరుమీదికి వచ్చింది. ఇప్పుడు నాకు ఏడాదికి రూ.50 వేల రైతుబంధు వస్తంది. నా ఒక్కనికే కాదు. ఊళ్లె ప్రతి ఇంట్ల ఏదో ఒక లబ్ధి కేసీఆర్ సార్ వల్లనే జరిగింది. మా ఊళ్లె ముదిరాజ్ల ఓట్లన్నీ టీఆర్ఎస్కే.
రాజేందర్ ఓటమి ఖాయం..
పేదింటి బిడ్డ. ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనును అందరం ఆశీర్వదిద్దాం. భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఈటల చెల్పూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని ఒరగబెట్టిందేమీ లేదు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేసిండు. రాజీనామా ఎందుకు చేసిండు. ఓట్ల కోసం మళ్లీ ఎందుకువస్తున్నడు. ఆయన్ను నమ్మితే మరోసారి మోసపోతం. రాజేందర్ ఓటమి ఖాయం. – పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల
ఫోరం మాజీ మండలాధ్యక్షుడు, (హుజూరాబాద్ రూరల్)