గోదావరిఖని/కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 14: కార్మికులను అవమానించేలా లోక్సభలో కేంద్ర మంత్రి మాట్లాడడం సరికాదని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు స్పష్టం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జేవీఆర్ ఓసీ 3, ఇల్లెందు కోయగూడెం ఓసీ బ్లాక్ 3, మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాకు చెందిన కేకే 6, శ్రావణ్పల్లి బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని సంస్థ ఎన్నో సార్లు కేంద్రానికి లేఖలు రాసినా, పట్టించుకోకుండా బహిరంగ వేలంలో పెట్టారు. అందుకు నిరసనగా సింగరేణిలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్తోపాటు జాతీయ కార్మిక సంఘాలమైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ జేఏసీగా ఏర్పడి మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఆ సమ్మెలో కార్మికులతో పాటు అధికారులందరూ పాల్గొన్నారు. సుమారు 38 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు. సమ్మె జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ కూడా రెండు సార్లు ప్రధానమంత్రికి సింగరేణిలో బొగ్గు బ్లాకు లు ప్రైవేట్పరం చేయవద్దని లేఖలు రాశారు. మూడు రోజుల సమ్మెతో సింగరేణి అధికారికంగా అందించిన లెక్కల ప్రకారమే రోజుకు 1.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మొత్తంగా 4.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగడంతో సుమారు రూ.120 కోట్లు నష్టం సంస్థకు వాటిల్లింది. రూ.45 కోట్లు కార్మికులు నష్టపోయారు. వందల కోట్ల నష్టం వాటిల్లే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రోత్సహిస్తుందా.. అనే ప్రశ్న వ్యక్తమవుతున్నది. లోక్సభలో కేంద్ర మంత్రి ప్రకటన తెలంగాణ రాష్ట్రంపై బీజేపీకి ఉన్న కపట ప్రేమను బయట పెట్టిందని స్పష్టమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సమ్మె చేసి ఉంటే బీజేపీ అనుబంధ కార్మిక సంఘమైన బీఎంఎస్, టీఆర్ఎస్కు సంబంధం లేని జాతీయ సంఘాలు ఎలా సమ్మెలో ఎలా పాల్గొన్నాయి..? బొగ్గు గనుల వేలంపై కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు అడిగిన వెంటనే వారి బ్లాకులను వారికే కేటాయించి తెలంగాణ రాష్ర్టానికి మాత్రం నాలుగు బ్లాకులను కేటాయించకుండా అపహాస్యం చేయడం కాదా..? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి సింగరేణి కార్మికులకు బేషరతుగా క్షమాపణ చెప్పి, నాలుగు బ్లాకులను సంస్థకు అప్పగించకపోతే భవిష్యత్లో ఉద్యమాలను చేయక తప్పదని స్పష్టం చేస్తున్నారు.
మరో సకల జనుల సమ్మె చేసి నాలుగు బొగ్గు బ్లాకులను కాపాడుకోవడంతో పాటు రైతులకు నల్ల చట్టాలు రద్దు చేసి క్షమాపణ కోరినట్లుగానే సింగరేణి కార్మికులకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ను ఎదుర్కొలేకనే కేంద్ర ప్రభుత్వం సంస్థకు చెందిన బ్లాకులను వేలం ద్వారా అమ్మివేస్తామని చెబుతున్నదని మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు బ్లాకులను వేలం వేస్తామని మాట్లాడి, కార్మికులను అవమానించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి కార్మికులు ఇంతలా ఆందోళన వ్యక్తం చేస్తున్నా, రా ష్ట్ర బీజేపీ నాయకులు నోరెందుకు మెదపడం లేదని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఎంఎస్ సమ్మెకు మద్దతు తెలిపి, సమ్మె విజయవంతానికి కృషి చేసినా బొగ్గు బ్లాకుల అం శం ఎంత తీవ్రతతో ఉందనేది వారికి అర్థం కావడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. సింగరేణి సంస్థకు చెందిన 4బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించే అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకులకు శ్రద్ధ ఉంటే తమ అధిష్టానం వద్దకు వెళ్లి రద్దు చేయించాలని డి మాండ్ చేస్తున్నారు. సంస్థ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఏ పా ర్టీ వ్యవహరించినా, భవిష్యత్లో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులు గ్రహించి, వెంటనే బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
యైటింక్లయిన్ కాలనీ, డిసెంబర్ 14: సింగరేణినిని కాపాడుకునేందుకు మేమంతా సమ్మెకు దిగాం. కేంద్రం ఇదేమీ పట్టించుకోకుండా బొగ్గు బ్లాకులు అమ్ముతమని ప్రకటించడం సరికాదు. కేంద్ర మంత్రి మాటలు ప్రైవేట్ సంస్థలకు మంచి చేయాలని చూస్తున్నట్లు ఉంది. సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నది. దీని వల్ల కార్మిక వర్గం ఉద్యోగ భద్రత కోల్పోవడంతోపాటు సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. సమ్మెను కించపరిచేలా కేంద్ర మంత్రి మాటలు ఉన్నాయి. బొగ్గు బ్లాకులను వేలం వేస్తే ఊరుకోం. అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతాం.n -బేతి చంద్రయ్య, ఈపీ ఆపరేటర్ ఓసీపీ-3
తాండూర్, డిసెంబర్ 14: పార్లమెంట్లో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. ప్రభుత్వమే సింగరేణిలో సమ్మె చేయించిందని ఆరోపించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కమర్షియల్ మైనింగ్ పేరిట వేలంలో ప్రైవేట్ వారికి కేటాయించే విధానాన్ని కచ్చితంగా అడ్డుకుంటాం. సింగరేణి కార్మికుల ఆకాంక్షను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. నాలుగు బొగ్గు బ్లాకులను వేలం నుంచి మినహాయించి సింగరేణికి అప్పజెప్పాలి. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ ప్రభుత్వం, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. -మల్రాజు శ్రీనివాసరావు, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు
సింగరేణిపై బీజేపీ అనుసరిస్తున్న తీరు సరైంది కాదు. చెమటను రక్తంగా మార్చి కార్మికులు బొగ్గు ఉత్పత్తిని చేస్తూ దక్షిణాది రాష్ర్టాలకు వెలుగులు అందిస్తున్నారు. అలాంటి సింగరేణిని రక్షించుకునేందుకు ఎక్కడిదాకైనా వెళ్తాం. కేంద్ర మంత్రి పార్లమెంట్లో అహంకారపూరితంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ర్టానికి చెందిన బీజేపీ నాయకులు ఈ అంశంపై నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కార్మికులంతా అస్యహించుకుంటుంటే రాష్ర్టానికి చెందిన బీజేపీ నాయకులు నోరు మూసుకోని ఎందుకు ఉంటున్నారో? అర్థం కావడం లేదు. కార్మికుల పోరాటాన్ని చిన్న చేసి చూస్తే సహించేది లేదు. కార్మిక సంఘాల నాయకులందరం ఐక్య పోరాటాలతో ముందుకు సాగుతాం. రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి
సింగరేణిలో సమ్మెపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది. కార్మికుల ఆకాంక్ష, కార్మిక సంఘాల ఐక్యతతోనే సమ్మెకు దిగాం. ఈవిషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. సింగరేణి కార్మికుల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడారు. దీన్ని ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేస్తామని మంత్రి చెప్పడంలోనే కార్మికులపై వారి వైఖరి అర్థమవుతున్నది. కేంద్రం వెనక్కి తగ్గకుంటే మరిన్ని ఆందోళనలు చేపడుతాం. రానున్న రోజుల్లో కేంద్రంపై సింగరేణి కార్మికుల ప్రభావం ఎలా ఉంటుందో చూపిస్తాం. మిర్యాల రాజిరెడ్డి , టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి
భూపాలపల్లి, డిసెంబర్ 14: సింగరేణి కార్మికులు చేసిన సమ్మె, రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి అనుచిత వాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. వేలం రద్దు చేసి నాలుగు బ్లాకులను సింగరేణి సంస్థకే ఇవ్వాలి. రెండు సార్లు బీఐఎఫ్ఆర్ అంచులదాకా వెళ్లిన సింగరేణి సంస్థను కార్మికులు ఎంతో కష్టపడి పనిచేసి లాభాల్లోకి తీసుకువచ్చారు. దేశంలోని నవరత్న కంపెనీలకు మిన్నగా సంస్థ రాణిస్తున్నది. ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే సింగరేణి కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ప్రైవేట్ వారికి బొగ్గు బ్లాకులను కేటాయిస్తే వారు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్లు చేసి బొగ్గు తవ్వకాలు చేస్తారు. – కొక్కుల తిరుపతి, టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు
భూపాలపల్లి, డిసెంబర్ 14: సింగరేణిలో మూడురోజుల పాటు రాజకీయాలకు అతీతంగా, ఐక్యతతో ఉండి మెరుపు సమ్మె చేశాం. మా ఉద్యోగాలు, మా బొగ్గు బావులను కాపాడుకోవడానికే సమ్మె చేశాం. పార్లమెంటుల మంత్రి మమ్మల్ని కించపరిచేలా మాట్లాడిండు. కార్మికులను కించపరిచేలా మాట్లాడినోడు ఎవరూ (పాలకులు) చరిత్రలో మిగలలే, ఇప్పటికైనా బీజేపోళ్లు తెలుసుకోవాలే. సింగరేణి తల్లిని కాపాడుకోవడానికి మూడు రోజుల సమ్మెకాదు.. ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. అన్ని ప్రైవేటోళ్లకు అమ్ముతున్నరు. ఇగ ఇప్పుడు సింగరేణి మీద పడ్డరు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలె. ఇలా వ్యాపారాలు చేయొద్దు. గిట్ల ఉద్యోగం, ఉపాధినిచ్చే కంపెనీలను అమ్ముతున్న సర్కార్ను జీవితంలో ఇప్పుడే జూస్తున్న ఇంతకు ముందెన్నడూ ఏ సర్కార్ ఇలా చేయలే. – దగ్గుల శ్రీనివాస్, కోల్కట్టర్, కేటీకే 5వ గని, భూపాలపల్లి ఏరియా