ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 14: తనకు డాక్టర్ కావాలని కల ఉండేదని, రెండుసార్లు ప్రయత్నించినా నెరవేరలేదని, చివరకు పోలీస్ అయ్యానని రామగుండం సీపీ ఎం శ్రీనివాసులు చెప్పారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో కాసేపు ముచ్చటించారు. తన కుటుంబం, చదువు, ఉద్యోగం ఇలా అన్నింటి గురించి వివరించారు. తన పూర్వీకులది నారాయణపేట జిల్లా అని, తాత నిజాం జాగీర్దారుగా ఉండేవారని, తన తండ్రి వ్యాపార నిమిత్తం హైదరాబాద్లోని లాల్దర్వాజ్కు వచ్చి స్థిరపడ్డారని చెప్పారు. ‘నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా లాల్ దర్వాజ్లోని వెంకట్రావ్ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల, ఆరో నుంచి ఇంటర్ దాకా మహబూబ్నగర్లో చదివా.
అనంతరం హైదరాబాద్లో డిగ్రీలో ఫస్టియర్లో చేరా. కానీ, డాక్టర్ కావాలన్న కోరికతో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నా. మొదట హోమియోపతి, రెండో దఫా అగ్రికల్చర్ సీట్ వచ్చింది. అయితే ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక నా ఆలోచన విరమించుకున్నా. తర్వాత ఉస్మానియాలో ఓపెన్ డిగ్రీ, ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేశా’ అని గుర్తు చేసుకున్నారు. అనంతరం తన ఫ్రెండ్స్, బంధువుల సూచనతో రెండు సార్లు యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యానని, రెండుసార్లు ఇంటర్వ్యూలో ఎంపిక కాలేదని చెప్పారు. అనంతరం ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లాలని అనుకున్నానని, అయితే అక్కడ సంక్షోభం రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని చెప్పారు.
తర్వాత 2001లో అప్పటి ఉమ్మడి ఏపీలో గ్రూప్-1 ఉద్యోగం సాధించి, డీఎస్పీగా మొదటి పోస్టు అనంతపూర్ జిల్లా ధర్మవరంలో వచ్చిందన్నారు. తర్వాత ఖమ్మం డీఎస్పీగా, నల్గొండ దేవరకద్ర, నందిగామ డీఎస్పీగా, హైదరాబాద్లో సీసీఎస్ టాస్క్ఫోర్స్లో డీఎస్పీగా పనిచేశానని, 2006లో ఐపీఎస్కు ఎంపికైనట్లు వివరించారు. అనంతరం రంగారెడ్డి ఎస్పీగా, సీఐడీ ఎస్పీగా ఇంటర్ పోల్లో మూడేండ్లు పనిచేసి, 2017లో ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసి, హైదరాబాద్లో జాయింట్ సీపీగా పనిచేసినట్లు తెలిపారు. ఇటీవల సీఐడీలో డీఎస్పీగా పనిచేసి తాజా బదిలీలో రామగుండం సీపీగా వచ్చానని శ్రీనివాసులు పేర్కొన్నారు.