కమాన్చౌరస్తా, ఆగస్టు 11 : అమ్మలోని ప్రేమ, నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమిన తోడబుట్టినవాళ్లకు రాఖీ కట్టి, తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటారు. తమ అన్న, తమ్ముడి నోరు తీపి చేసి వారంతా జీవితాంతం సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి రాఖీ పండుగ ఒక వారధిలా నిలుస్తున్నది.
మెట్టినింటి నుంచి పుట్టింటికి..
రాఖీ పండుగ రోజున అక్కాచెల్లెళ్లు తప్పనిసరిగా మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరుతారు. అన్నదమ్ములకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపిస్తారు. సోదరులు తమకు తోచినంత అక్కాచెల్లెళ్లకు కట్నం పెడతారు. ఎంత ఇచ్చినా అదే మహద్భాగ్యంగా స్వీకరించే ఆడపడుచులు, అంతకు లక్షల రెట్ల విలువైన ఆశీర్వచనాలు ఇస్తారు. అన్నదమ్ములతో తమ కష్టసుఖాలు చెప్పుకుని స్వాంతన పొందుతారు. ‘మీ బావ గిట్లంటండు..’ అని చెల్లె చెబితే, ‘నీనడుగుతతియ్యె బావను.. ఎవ్వరు లేరనుకుంటండా ఏంది..?’ అంటూ అన్న భరోసా ఇస్తాడు. అందుకే సోదరులు లేని స్త్రీలు, ‘అన్నదమ్ములున్న బలం వేరే ఉంటది..’ అని తరుచూ అనడం వింటుంటాం..!
పండుగ వాతావరణం
రాఖీ కట్టేందుకు వచ్చిన ఆడబిడ్డలతో పుట్టింట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్వీట్లు, పాయసంతో నోరు తీపి చేసుకోవడం కనిపిస్తుంది. కబుర్లతో కాలం ఇట్టే గడిచిపోతుంది. ఈ రకంగానైనా ఓ సారి ఆడబిడ్డలకు పుట్టింటికి వచ్చే అవకాశం దక్కుతుంది. ఈ తీపి జ్ఞాపకాలను ఏడాదంతా నెమరేసుకునే వీలు చిక్కుతుంది.
సోదరులకే కాదు..
తోబుట్టువులకే కాక, సోదర వాత్సల్యంతో ప్రతి ఒక్కరికీ రాఖీలు కట్టవచ్చు. స్వాతంత్రోద్యమ కాలంలో దేశంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు మన జాతీయనేతలు ఈ రక్షాబంధన్ను ఒక అస్త్రంగా ఉపయోగించారు కూడా! యుద్ధాలను నివారించిన ఘనత కూడా ఈకంకణానికి ఉంది.