హుజూరాబాద్/ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 25: హుజూరాబాద్ – జమ్మికుంట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి రెండు పట్టణాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హామీ ఇచ్చారు. మనకు అన్నం పెట్టే టీఆర్ఎస్ కావాలో..? దాచుకున్నది దోచుకపోయే బీజేపోళ్లు కావాలో..? ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. సోమవారం హుజూరాబాద్లోని 7, 11వ వార్డుల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అంతకు ముందు టీఆర్ఎస్ పట్టణశాఖ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దంపతులు కొలిపాక శ్రీనివాస్-నిర్మల ఇంటికి వెళ్లి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా వారు వినోద్కుమార్ను గజమాలతో సత్కరించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇప్పుడు గొప్పగొప్ప మాటలు మాట్లాడుతున్న కేంద్రమంత్రులు, ఆ పార్టీ ఎంపీలు హుజూరాబాద్కు ఏం చేస్తారో చెప్పకుండా అన్నీ ఉత్త ముచ్చట్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. మూడు నెలల్లో ఎన్నో పనులు చేశామని చెప్పారు. ఈటల చేయకుండా వదిలేసిన పనులు చేశామని, కేంద్ర మంత్రులు వచ్చి ఏమైనా చేశారా? ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నపుడే ఆయన ఏమీ చేయలేదని, గెలిచినా చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు.
పేదోళ్లకు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదని, కానీ, గెల్లును గెలిపిస్తే ఐదు వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. రాజేందర్ ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకునేందుకు కుట్రలు చేస్తున్నాడని, ఇప్పటి వరకు ఆయన ఎందుకు రాజీనామా చేసిండో ప్రజలకు చెప్పలేదని మండిపడ్డారు. ఆయనకు రాజకీయ ఓనమాలు నేర్పి, ప్రపంచానికి పరిచయం చేసిన కేసీఆర్ను తిట్టడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ రాష్ర్టానికి చేసేందేమీలేదని, పైగా ప్రజలపై ధరల భారం మోపుతున్నదని ధ్వజమెత్తారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.500కు తగ్గిస్తామని చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని హితవుపలికారు. ఇవ్వాళ అన్ని సర్వేలు గెల్లు గెలుపు ఖాయమని చెబుతున్నాయని, యువకులు, మహిళలు కారుకే ఓటు వేస్తామంటున్నారని చెప్పారు. గెల్లు గెలిస్తే నియోజకవర్గం ప్రగతిలో దూసుకెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈటల బాధను ప్రజలపై రుద్దుతున్నడు..
ఈటల ఆత్మగౌరవానికి ప్రజలకు ఏమైనా సంబంధమున్నదా? తన బాధను ప్రజల మీద రుద్దుతూ సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన హుజూరాబాద్ మండలం కొత్తపల్లిలో టీఎన్జీవో రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఎన్జీవో పాత్ర మరవలేనిదన్నారు. రాష్ట్రం ఏర్పడేదాక టీఎన్జీవో విశ్రమించలేదన్నారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ సమయ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవి అని కొనియాడారు. ఈటల రాజీనామా ఎందుకు చేసిండో ఇప్పటికీ ప్రజలకు చెప్పలేదన్నారు. ఒక నదిని ఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి చూపించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. హింస లేకుండా స్వాతంత్య్రం సాధించిన మాదిరిగానే రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారని కొనియాడారు. సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర నాయకుడు దేవిశ్రీప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్కుమార్, టీఎంయూ రాష్ట్ర నాయకుడు థామస్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హమీద్, నాయకులు హన్మంత్గౌడ్, విష్ణుదాసు గోపాల్రావు, ఎర్రం పాపిరెడ్డి, ఐలయ్య, దత్తాత్రేయ, మందల భాస్కర్, మధు పాల్గొన్నారు.
ఏం చేస్తరో ఎందుకు చెప్తలేరు..
‘ఈటల ఆయన స్వార్థం కోసం రాజీనామా చేసిండు. ఇన్నాళ్లూ బీజేపీని విమర్శించి, అదే పార్టీలో చేరి ఎన్నిక తెచ్చిండు. గెలిస్తే ఏం చేస్తరో చెప్పకుండా ఓట్లు అడుగుతున్నారని’ మండిపడ్డారు. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి, పెద్దంపల్లిలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే వావిలాలలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, గౌడ ఫెడరేషన్ అధ్యక్షుడు యాదగిరిగౌడ్తో కలిసి హాజరయ్యారు. కాగా, వినోద్కుమార్కు జగ్గయ్యపల్లి, పెద్దంపల్లి సర్పంచులు, వంశీధర్రావు, అన్నపూర్ణ, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయా చోట్ల వినోద్కుమార్ మాట్లాడారు. ఈటల సీఎం కుర్చీపైనే కన్నేశాడని, ఈటలకు అనేక పదవులు ఇచ్చి పెద్ద చేసిన కేసీఆర్కే వెన్నుపోటుపొడవాలని విమర్శించారు. ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ దొడ్డె మమత, జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, రైతు బంధు జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, వైస్ ఎంపీపీ తిరుపతిరావు, ఎంపీటీసీ మర్రి మల్లేశం, గౌడ సంఘం అధ్యక్షుడు వెంకట్రాజ్యం, నాయకుడు గుడూరి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.