జైలుకెళ్లినా మారని తీరు
వాహనాల తనిఖీలో పోలీసులకు చిక్కిన నిందితుడు ఒడ్డె శ్రీను
ఆరు వాహనాలు స్వాధీనం
పీడీ యాక్ట్ నమోదుకు రంగం సిద్ధం
పోలీస్ కమిషనర్ నాగరాజు వెల్లడి
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 7: సాధారణంగా దొంగలు బైకులను చోరీచేసి అమ్ముకుంటారు. కానీ ఈ యువకుడు బైకులను చోరీ చేసి సరదా తీర్చుకొని దాచుకుంటాడు. కానీ బైక్ను కొనలేక, ఎలాగైనా తన సరదా తీర్చుకోవడానికి ద్విచక్రవాహనాలను దొంగిలించి, దాచుకో వడం వృత్తిగా పెట్టుకున్నాడు. ముఖ్యంగా పంట పొలాల వద్ద రైతులు బైక్కు తాళం వేయకుండా మరిచిపోతే వాటిని టార్గెట్ చేసేవాడు. గతంలో ఉమ్మడి జిల్లాలో బైక్లను చోరీచేస్తూ పోలీసులకు చిక్కి జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చినా తీరుమార్చుకోని సదరు యువకుడు మళ్లీ బైకుల చోరీకి అలవాటు పడ్డాడు. సోమవారం మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా సదరు యువకుడు అనుమానాస్పద కదలికలతో వారికి చిక్కాడు. అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన ఒడ్డె శ్రీనుగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ కేఆర్ నాగరాజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొల్లూరు గ్రామానికి చెందిన ఒడ్డె శ్రీను అనే యువకుడు గతంలో ఏడు ద్విచక్రవాహనాలను దొంగిలించి బాన్సువాడ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించగా రెండేండ్లు జైలుశిక్ష విధించారు. ఒడ్డె శ్రీను 2021 సెప్టెంబర్లో జైలు నుంచి విడుదల కాగా, మళ్లీ దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల వద్ద రైతులు తమ వాహనాలకు తాళం చెవులు అలాగే ఉంచి వెళ్లడాన్ని నిందితుడు శ్రీను గమనించేవాడు. అలాంటి బైక్లను టార్గెట్ చేస్తూ మొత్తం ఆరు ద్విచక్రవాహనాలను దొంగిలించాడు. సీపీ ఆదేశాల మేరకు సోమవారం మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై మహేశ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీను అనుమానాస్పద కదలికలతో పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకొని విచారించి, దొంగిలించిన ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పా రు. జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా ఒడ్డె శ్రీను తన నడవడికను మార్చకోలేదని పోలీసుల దర్యాప్తులో తేలిందని, అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు ఏసీపీకి సూచించనున్నట్లు తెలిపారు.