తెలంగాణ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇష్టారాజ్యంగా ఉద్యోగుల భర్తీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ అధ్యాపక బృందం ఫిర్యాదులు చేయడంతో గవర్నర్ తమిళిసైతో పాటు ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఎడాపెడా ఉద్యోగాలను సృష్టించి భర్తీ చేసే అధికారం ఎవరికీ లేదంటూ తేల్చి చెప్పింది. యూనివర్సిటీల్లో వీసీ, రిజిస్ట్రార్లు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలని కఠిన ఆదేశాలిచ్చింది.
నిజామాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన యూనివర్సిటీ బాధ్యులపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర స్థాయిలో మండిపడినట్లు తెలిసింది. టీయూ లో వెలుగు చూసిన అంశంతో అప్రమత్తమైన ఉన్నత విద్యాశాఖ ఏకంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వర్తించే విధంగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై ప్రభు త్వం చెప్పేంత వరకు ఏ యూనివర్సిటీలోనూ నియామకాలు చేపట్ట వద్దని వైస్ చాన్స్లర్, రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొంత మంది అక్రమార్కులు డబ్బులకు ఆశ పడి ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగా ఇకపై వీసీ, రిజిస్ట్రార్లు ఎలాంటి పోస్టులను భర్తీ చేయకూడదంటూ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఓ యూనివర్సిటీలో వెలుగు చూసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలిస్తున్నట్లుగా సర్కారు అందులో పేర్కొంది.
ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదంటూ హెచ్చరించింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాల అంశంతో అన్ని యూనివర్సిటీలపై ఆంక్షలు విధించేలా ప్రభుత్వం నిర్ణయించడంతో అక్రమార్కుల్లో ఉలికి పాటు మొదలైంది.
అంతా ఆగమాగం…
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కేంద్రంగా స్థాపించబడిన తెలంగాణ యూనివర్సిటీలో 46 మందికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించారు. ఇందులో రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా, అర్హతలను నిర్ణయించకుండా, వర్సిటీ పెద్దలకు పరిచయం ఉన్న వారిని, వారి బంధువులకు పెద్ద పీట వేస్తూ ఉద్యోగాలను భర్తీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలను భర్తీ చేయాలనే నిబంధన ఎక్కడా లేదు. పారదర్శకంగా ఖాళీలను నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ యూనివర్సిటీలో 2014 నుంచి నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలున్నాయి. యూనివర్సిటీల్లోనే వివిధ హోదాల్లో పని చేస్తూ దశాబ్దా కాలం పాటు ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చు న్న ఆచార్యులకు, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఈ విషయం తెలిసినప్పటికీ నిబంధనలను పట్టించుకోలేదు. సవ్యంగా చేపట్టాల్సిన ఉద్యోగాల భర్తీని అంగట్లో సరుకులు విక్రయించినట్లుగా అమ్ముకున్నట్లు విమర్శలు వ చ్చాయి. అనర్హులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు వారికి బాధ్యతలు కల్పించి విధుల్లోకి తీసుకున్నారు. ఈ విషయం బయటికి పొక్కడంతో దొడ్డి దారిలో వచ్చిన వారిని ప్రస్తుతం దూరం పెట్టారు.
ఆ ఇద్దరిపై విచారణ…?
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన ఏడేండ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రాథమిక విద్య నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు సమ ప్రాధాన్యతను కల్పిస్తూ కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న వీసీ నియామకాలను సైతం ఈ మధ్యనే ప్రభుత్వం నియమించింది. అన్ని యూనివర్సిటీల్లోనూ పరిశోధనలు పెంచడంతో పాటుగా విద్య నైపుణ్యతలను పెంపొందించేలా కృషి చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. సర్కారు ఉద్దేశాన్ని దెబ్బతీస్తూ తెలంగాణ యూనివర్సిటీలో ఆది నుంచి కొంత మంది అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. వీసీ నియామకాల తర్వాత మార్పు కనిపిస్తుందని ప్రభుత్వం భావించింది. కానిక్కడ అందుకు భిన్నంగా మరింతగా టీయూ ప్రతిష్ట దిగజారింది. అక్రమంగా ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యూనివర్సిటీ అపకీర్తి మూట కట్టుకున్నట్లుగా మారింది. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటా బయట డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఆ ఇద్దరు వ్యక్తుల వ్యవహారంపై విచారణకు ఆదేశించేందుకు ఉన్నత విద్యా శాఖ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలను, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లను వాడుకుంటూ సర్కారుకు అపకీర్తి తెస్తున్న వ్యక్తులను ఉపేక్షించకూడదని యూనివర్సిటీ ఆచార్యులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.