రెండేండ్లుగా కంటికి కనిపించని కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్నది. 2019, నవంబర్లో చైనాలో పుట్టిన కరోనా వైరస్ దేశాలన్నింటికీ పాకేసింది. తన వలయంలో ప్రజలను చుట్టేసుకుని నానా ఇబ్బందులకు గురిచేసింది. సర్వం మూత పడి కనీవిని ఎరుగని విపత్కర పరిస్థితులను కల్పించింది. లాక్డౌన్తో భారతదేశంతో పాటు అనేక దేశాలు స్తంభించిపోయాయి. కరోనా ముప్పు నుంచి బతికిబయట పడేందుకు ఎదురైన కష్టాలతో ఆర్థిక వ్యవస్థ సైతం కుప్పకూలింది. సర్వం సతమతమై కుదేలవ్వగా టీకా రూపంలో వచ్చిన వజ్రాయుధం కరోనా నుంచి మనుషులకు కాసింత ఉపశమనం కలిగించింది. దీంతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దసరా పండుగ సందర్భంగా జరిగిన కోలాహలంతో వ్యాపార, వాణిజ్య వర్గాల్లో సంబురం కనిపిస్తోంది. గతేడాది వెలవెలబోయిన వ్యాపారాలు.. నేడు రెట్టింపు స్థాయిలో పెరుగడంతో సంబంధిత వర్గాల్లో ఆనందం కనిపిస్తోంది.
నిజామాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా పేరు వింటేనే గజగజ వణికిపోయే పరిస్థితి. మహమ్మారి కారణంగా మనుషుల మధ్య అంతరాలు సైతం పెంచింది. రెండేండ్లుగా ప్రపంచాన్ని సైతం వణికిస్తున్నది. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించడంతో సర్వం మూత పడ్డాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. చిరు వ్యాపారాలు మొదలు పెద్దపెద్ద కంపెనీలు సైతం విలవిల్లాడిపోయాయి. కరోనాను అడ్డుకునేందుకు టీకా కనిపెట్టడంతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలు మెల్లగా పట్టాలెక్కుతున్నాయి. గత ఏడాది మహమ్మారి కారణంగా దసరా పండుగ సందర్భంగా వెలవెలబోయిన వ్యాపారాలు నేడు అంతకు రెట్టింపు స్థాయిలో పెరగడంతో వ్యాపార వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
కొత్త వాహనాల జోరు..
దసరా పండుగ సందర్భంగా ఏటా కొత్త వాహనాలు మార్కెట్లో సందడి చేయడం పరిపాటి. ఈ సారి పండుగకు ఆటోమొబైల్ కంపెనీల హవా స్పష్టంగా కనిపించింది. గతేడాది కరోనా మూలంగా పండుగలకు కొనుగోళ్లు అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంతో డీలర్లు తీవ్రంగా నష్టాలు చవిచూశారు. నిర్వహణ భారంతో సతమతమయ్యారు. 2020 ఏడాది పొడవునా ప్రజల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో కొత్త వాహనాలు అమ్మడం కష్టంగా కనిపించింది. 2021 ప్రారంభం నుంచి పరిస్థితులు అనుకూలించడంతో ఆటోమొబైల్ రంగం తిరిగి పునరుత్తేజమైంది. దసరా పండుగకు నిజామాబాద్ జిల్లాలో అంతర్జాతీయ స్థాయి బ్రాండెడ్ వాహనాలు దిగుమతి కావడం కనిపించింది. ఎంజీ, కియా, ఆడి, టాటా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలకు చెందిన బ్రాండెడ్ కార్లు రోడ్లపై చక్కర్లు కొట్టాయి. కొంత మంది సంపన్న వర్గాలకు చెందిన వారు ఏకంగా తమ స్థాయికి తగ్గట్లుగా మెర్సిడేజ్ బెంజ్ వాహనాలను కొనుగోలు చేశారు. ద్విచక్ర వాహనాల అమ్మకాల్లోనూ ఈసారి జోరు కనిపించింది. బ్యాటరీ వాహనాలు సైతం పలువురు దసరాకు ఇంటికి తీసుకెళ్లారు. మొత్తంగా 2020 దసరాతో పోలిస్తే 2021 పండుగకు ఆటోమొబైల్ రంగంలో స్పష్టమైన మార్పు కనిపించింది. అనుకూలమైన వాతావరణం ఏర్పడడంతో కొనుగోళ్లతో సంబంధిత వర్గాల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
రికార్డు స్థాయిలోమద్యం అమ్మకాలు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థా యిలో జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని ఆయా మద్యం దుకాణాలకు సరఫరా అయినటువంటి మద్యం విలువ అక్షరాల రూ.14కోట్లకు చేరడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2020లో కరోనా విపత్తుతో చాలా మంది ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకున్నారు. పండుగను నిర్ణీత స్థాయిలోనే జరుపుకొన్నారు. హడావుడి తగ్గించుకుని అవసరం మేరకు సంప్రదాయాలను పాటించి మమ అనిపించారు. 2021 దసరా నాటికి పరిస్థితులు మెరుగు పడడంతో ప్రజల్లో కొంగొత్త జోష్ కనిపించింది. దసరా పండుగ సందర్భంగా మద్యం ప్రియులు ఏకంగా రూ.14కోట్ల విలువైన బీరు, విస్కీని కొనుగోలు చేసినట్లుగా ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 128 వైన్స్లు, 23 బార్లు, 3 క్లబ్లు ఉన్నాయి. వీటికి మాక్లూర్ మండలం మాదాపూర్లోని ఐఎంఎల్ డిపో నుంచి వివిధ రకాల విస్కీ, బీరు సీసాలను పంపిణీ చేస్తారు. అయితే గత ఏడాది విజయ దశమి సందర్భంగా రూ.8.68 కోట్లు విలువైన మద్యం అమ్ముడు కాగా… ఈ సారి రూ.14కోట్లకు మద్యం వ్యాపారం చేరుకుంది. అంటే రూ.5.32 కోట్లు అదనంగా బీరు, విస్కీ అమ్మకాలు పెరిగాయి.
రూ.200 కోట్ల బట్టల వ్యాపారం…
రాష్ట్రంలో అన్ని పండుగలతో పోలిస్తే దసరా పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆస్తులు, అంతస్తులకు సంబంధం లేకుండా ప్రజలంతా కొత్త బట్టలు, వాహనాలు వంటివి కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్నది. ఏదైన శుభకార్యం తలపెట్టాలన్న దసరా రోజును ఎంచుకోవడం చాలా మంది సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఆర్థిక అసమానతలకు సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయిని బట్టి దుస్తులు కొనుక్కోవడం దసరా రోజు కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ దసరాకు దాదాపు రూ.200 కోట్ల మేర దుస్తుల వ్యాపారం జరిగినట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే దాదాపు 60కి పైగా బట్టల షోరూమ్లు, బ్రాండెడ్ కంపెనీల స్టోర్లు ఉన్నాయి. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ పట్టణాల్లోనూ పదుల సంఖ్య షో రూమ్లు నెలకొన్నాయి. ఎల్లారెడ్డి, భీమ్గల్, నందిపేట, నవీపేట, బిచ్కుంద వంటి పెద్ద మండలాల్లోనూ దుకాణాలు విరివిగా ఉన్నాయి. వీటిల్లో రూ.కోట్లు విలువ చేసే వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లుగా సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో రూ.50 కోట్లు నుంచి రూ.80 కోట్ల వరకు దుస్తుల అమ్మకాలు జరిగినట్లు సమాచారం.
నిరంతర ద్రవ్య చలామణి…
కరోనా వైరస్తో సహజంగానే దేశం, రాష్ట్రంలో ఊహకు అందని విధంగా నష్టాలు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందక పోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా కష్టాన్ని సులువుగా దాటుకుని ప్రయాణించింది. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో నైతిక మద్దతు లభించింది. రెండేండ్ల కాలంలో ప్రపంచంలో పెట్టుబడులే కరువవ్వగా రాష్ట్రంలో దేశ, విదేశీ కంపెనీలు నూతనంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూప డం ఇందులో భాగమే. రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తోన్న సంక్షేమ పథకాలు పరోక్షంగా మార్కెట్లో ద్రవ్య చలామణికి ఊతం ఇచ్చింది. రైతుబంధు, ఆసరా పింఛన్ల పంపిణీతో ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేందుకు ఉపయోగపడిన ట్లు అయ్యింది. వ్యవస్థ కుదేలు కాకుండా తీసుకున్న చర్యలతో ఏడాది కాలంలో సమూల మార్పులతో తెలంగాణ సమాజం కరోనా ముంగిట గెలిచి నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.
వ్యాపారం బాగుంది
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 17: రెండు సంవత్సరాలుగా వ్యాపారం అంతంత మాత్రమే సాగింది. ఈ సారి కూడా అలాగే ఉంటుందని భావించాను. ఈ సంవత్సరం దసరాకు బంగారం కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. ప్రజలు బంగారు నగలు తయారు చేయించుకోవడానికి ఆసక్తి చూపారు. గత సంవత్సరం కన్నా ఈ సారి వ్యాపారం బాగుంది.
-దేవిన్ కుమార్
కొంచెం అందోళన ఉండే..
కరోనాతో రెండు సం వత్సరాలుగా వస్త్ర వ్యా పారం అనుకున్నంత జరుగలేదు. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందని ఆందోళన చెందాను. దీంతో కొంతమేర స్టాక్ తీసుకువచ్చాను. కానీ ఈ దసరాకు ప్రజలు కొత్త దుస్తులు కొనడానికి ఆసక్తి చూపారు. ఈ సారి తీసుకొచ్చిన స్టాక్ మొత్తం అమ్ముడుపోయింది.
-సంపత్గౌడ్, ఫస్ట్లుక్ షోరూం