స్వయంసహాయక సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పొదుపుసంఘాల మహిళలకు స్త్రీనిధి ద్వారా వ్యాపారాల నిర్వహణకు, నైపుణ్యాల మెరుగుదలకు శిక్షణతో స్వయంఉపాధికి బాటలు వేస్తున్నది. ఎందరో మహిళలు పొదుపు సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు బాటలు వేసుకుంటు న్నారు. తద్వారా వారి కుటుంబాలకు సామాజికంగానూ గుర్తింపు పెరుగుతున్నది. స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలోనూ మహిళాసంఘాలు స్పష్టతతో వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను స్త్రీనిధి ద్వారా 203.42కోట్ల రుణాన్ని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది నాలుగు వేలమందికి ఉపాధి కల్పించాలని భావించగా, ఇప్పటివరకు 2932 మంది లబ్ధిదారుల్ని గుర్తించారు.
డిచ్పల్లి, సెప్టెంబర్ 15: స్వయం సహాయక సంఘా ల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ‘స్త్రీనిధి’ ద్వారా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలకు స్త్రీనిధి ద్వారా వ్యాపారాల నిర్వహణ, నైపుణ్యాల పెంపుదలకు శిక్షణతో స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని మహిళా సంఘాల సభ్యులు వ్యాపారంలో రాణించేలా చూడడం, ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న వారికి వ్యాపార విస్తరణకు రుణ సదుపాయాలను కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగా నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తారు. గ్రేడెడ్ ముర్రా గేదె లేదా సంకర జాతి ఆవుకు రూ.75వేల వరకు రుణాన్ని పొందవచ్చు. పశువులకు బీమా కల్పించేందుకు, రవాణాకు రూ.మూడు వేలు, రెండు నెలలకు అయ్యే దాణా, మేత ఖర్చు అన్ని కలిపి రూ.93వేల వరకు రుణ సదుపాయం ఉంటుంది. మొదటి పాడి పశువు కొన్న ఆరు నెలల అనంతరం రెండో పాడి పశువు కొనుగోలుకు రుణాన్ని పొందవచ్చు. మహిళలు గ్రామ సంఘాల్లోని ఏ, బీ, సీ గ్రూపుల్లో సభ్యులుగా ఉండాలి.
పాడి గేదెల కోసం..
నిజామాబాద్ జిల్లాలో 1,168 గ్రామ సంఘాలు, స్లమ్ సమాఖ్యలు, 34,883 స్వయం సహాయక సంఘా లు ఉన్నాయి. 11,722 సంఘాలకు రూ.50 కోట్ల 25లక్షలు రుణం అందజేశారు. స్త్రీనిధి ద్వారా నాలుగు వేల యూనిట్లకు రూ.203.42 కోట్లతో రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 134 మందికి రుణాలు మంజూరు చేశారు. నాలుగు వేల మందికిగాను 2,932 మంది అర్హులను గుర్తించారు. గేదెలను పక్క రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయడం ద్వారా పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పశువుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
పౌల్ట్రీఫామ్..
పౌల్ట్రీఫామ్లో దేశీ కోడి పిల్లలను ఉత్పత్తి చేయాలి. ఒక్కో యూనిట్కు కావాల్సిన డబ్బులను మంజూరు చేస్తారు. మదర్ యూనిట్ను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉత్పత్తి అయిన వాటిని మండలాలు, పట్టణాల్లో ఆసక్తి ఉన్న మహిళలు పెరటికోళ్లుగా పెంచుకుంటారు. ఒక్కో యూనిట్కు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు రుణాలను అందిస్తారు.
ఎలక్ట్రిక్ (ఈ) ఆటోలు..
సంఘాలకు ఎలక్ట్రిక్ ఆటోల కోసం రుణాలను అందజేస్తారు. బ్యాటరీ సహాయంతో నడిచే ఈ ఆటోల ద్వారా కాలుష్యం తగ్గుతుంది. అందుకే వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ యూనిట్కు రూ.మూడు లక్షల వరకు రుణాన్ని అందిస్తారు.
పశువులకు బీమా..
స్త్రీనిధి నుంచి పొందిన రుణంతో పశువును కొనుగోలు చేసిన వెంటనే ట్యాగ్ వేసి ఆ వివరాలను అప్లోడ్ చేయాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు పశువు మరణిస్తే ట్యాగ్ కనిపించే విధంగా ఫొటోలు తీసి టాబ్లెట్ పీసీలో నమోదు చేయాలి. యునైటెడ్ ఇన్సూరెన్స్ ఉన్న పాలసీ కాలంలో పశువు మరణిస్తే బీమా మంజూరు చేస్తారు.
వ్యవసాయ పరికరాలు..
వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ రుణాలు మండల సమాఖ్యలకు మాత్రమే అందజేస్తారు. ఒక్కో యూనిట్కు రూ.15లక్షల నుంచి రూ.25లక్షల వరకు రుణాలను ఇస్తారు. పరికరాలను మాత్రం జిల్లా కమిటీ కొనుగోలు చేస్తుంది.
సంఘాల వివరాలు వెబ్సైట్లో..
స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలు స్త్రీ నిధి వెబ్సైట్లో నమోదు చేస్తారు. దీనికి సీయూజీ సెల్ఫోన్ సౌకర్యం కల్పించారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు మండల, గ్రామాల, పట్టణ సమాఖ్యలకు వేర్వేరుగా ఐడీ నంబర్లు కేటాయిస్తారు. వీటిని స్త్రీనిధి బ్యాంకు వెబ్సైట్లో ఆన్లైన్ చేస్తారు. స్త్రీనిధి బ్యాంకుకు ఎవరైతే రుణం కోసం దరఖాస్తు చేసుకుంటా రో వారి నగదు నిల్వ, ఇతర వివరాలు స్త్రీనిధి బ్యాంకు వెబ్సైట్లో కనిపిస్తాయి. నిర్ణయించిన వాయిదాల ప్రకారం రుణాలు పొందిన సభ్యులు సంఘం సమావేశంలో వాయిదాను చెల్లించాలి. సమాఖ్యల సమావేశం నాటికి సభ్యులు వసూలు కావాల్సిన నెలసరి వాయిదా, గత నెల బకాయి కలిపి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు సమాఖ్యల వద్ద ఉన్న టాబ్లెట్ పీసీలో స్త్రీనిధి డీసీబీ రిపోర్టులో ప్రతినెలా చూసి నిర్ధారించుకోవాలి.
మహిళా సంఘాల అభ్యున్నతి కోసమే..
మహిళా సంఘాల అభ్యున్నతి కోసమే స్త్రీనిధి ద్వారా కోట్లాది రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తూ వారికి బాసటగా నిలుస్తోంది. ఈ సంవత్సరం స్త్రీనిధి ద్వారా జిల్లాలో రుణాలు రూ.203 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు నాలుగు వేల మందికిగాను 2,932 మంది అర్హులను గుర్తించాం. మహిళలు రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలోని ఏపీఎంలు, సీసీలు, సిబ్బంది సమష్టిగా కృషి చేసి జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడాలి.
మహిళా సంఘాలకు అవగాహన కల్పించాం..
స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు కల్పిస్తున్న రుణాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. స్త్రీనిధి ద్యారా మహిళలు అవసరానికి అనుగుణంగా రూ.10 వేల నుంచి మూడు లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. స్త్రీనిధి లక్ష్యాన్ని చేరుకుంటాం.