ఆర్మూర్, సెప్టెంబర్ 14: పంటల వివరాలను పక్కాగా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లాలో వానకాలంలో సాగవుతున్న పంటల వివరాలను క్లస్టర్ల వారీగా ఏఈవోలు సేకరిస్తున్నారు. పంటల సాగు వివరాల నమోదుతో దిగుబడులను అంచనా వేయడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు వీలువుతుందని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా పంటల వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్నాయక్ సూచించడంతో ఏఈవోలు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఆన్లైన్లో పూర్తి వివరాలను నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వానకాలంలో 4,41,421 ఎకరాల్లో వివిధ పకాల పంటలను రైతులు సాగుచేస్తున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో వరి 2,86,160 ఎకరాలు, మక్కజొన్న 44,851 ఎకరాలు, సోయాబీన్ 93,360 ఎకరాలు, చెరుకు 754 ఎకరాలు, పత్తి 3128 ఎకరాలు, 20 వేల ఎకరాల్లో కూరగాయలు, చిరుధాన్యాల పంటలు సాగవుతున్నాయి. అధికారుల ఆదేశాల మేరకు క్లస్టర్ల వారీగా ప్రతిరోజూ ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో పంటలను విక్రయించుకునేందుకు వీలు కలుగుతుంది. దళారుల పెత్తనం, ఇతర రాష్ర్టాల వారు ఇక్కడ పంటలను విక్రయించకుండా నిరోధించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేండ్లుగా ఈ పద్ధతిని కొనసాగిస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు సాగుచేస్తున్న పంటల పూర్తివివరాలను ఈనెల 20వ తేదీలోగా పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు. ఇప్పటికే 67శాతం పూర్తిచేశామని చెప్పారు.
వివరాలు నమోదు చేసుకుంటుండ్రు..
వ్యవసాయాధికారులు పొలాల వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుంటుండ్రు. వివరాలు చెబితే సర్వే నంబర్లు, రైతుల పేర్లను ఆన్లైన్లో పెడుతరంటా. పంట వచ్చినంక అమ్ముకునేందుకు ఇబ్బంది ఉండదని అధికారులు అంటున్నరు.
ఎలా నమోదుచేయాలో వివరించాం..
పంటల నమోదు ఎలా చేయాలో ఇదివరకే ఏఈవోలకు వివరించాం. గతంలో జిల్లాకేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించాం. రైతు పేరు, సర్వే నంబరు, వేసిన పంటను కచ్చితంగా నమోదు చేయాలి.