రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా రూపురేఖలు మార్చుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది నిజామాబాద్ మండలంలోని మల్కాపూర్ (ఎం) కొత్తపేట గ్రామం. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో జీపీ పాలకవర్గం, అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ గ్రామ పరిధిలో సోమ్లనాయక్ తండా, బబ్బిచంద్ తండాలు కూడా ఉన్నాయి.
గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన గుంతలమయంగా ఉన్న 30 గుంటల స్థలాన్ని చదును చేసి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అందులో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
పల్లె ప్రగతితో ఏండ్ల తరబడి ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించింది. కొత్తగా 32 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. 20 స్తంభాలకు మూడో తీగను బిగించారు. గ్రామమంతటా 170 వీధి స్తంభాలకు ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసిన ఫలితంగా విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. జీపీ కార్యాలయం వద్ద రూ.70వేలతో హైమాస్ట్ (సెంట్రల్ లైటింగ్) లైట్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరరక్షణకు రూ.62 వేలతో ప్రధాన కూడళ్ల వద్ద 4 సీసీ కెమెరాలను అమర్చారు.
పల్లె ప్రగతిలో భాగంగా విడుదల చేసిన రూ.12 లక్షలతో వైకుంఠధామం నిర్మించి రంగులతో తీర్చిదిద్దారు. వానకాలంలో దహన సంస్కారాలు చేసేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. దహనవాటికలు నిర్మించడంతో ఆ సమస్య తొలగిపోయింది. బోరు వేసి నీటి వసతి కల్పించారు. వైకుంఠధామం ప్రాంగణంలో మొక్కలు నాటడంతో హరితశోభ సంతరించుకున్నది.
జీపీ తరఫున రూ.9.50 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ట్యాంకర్ను కొనుగోలు చేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు. దీంతో సీజనల్ వ్యాధులు ప్రజల దరి చేరడం లేదు. రూ.11లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలను నిర్మించారు.
రెండేండ్లలోనే ఊహించని అభివృద్ధి జరిగింది. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతున్న పల్లెప్రగతిని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గ్రామస్తులు, అధికారుల సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం.