పరకాల, ఏప్రిల్ 18 : పరకాల 9వ వార్డు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీ అభ్యర్థి చిదురాల దేవేందర్కు బీఫాం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలోనే పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించామన్నారు. పట్టణం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రతిపక్షాలకు స్థానం లేదని, అభివృద్ధి చేసిన టీఆర్ఎస్కే ప్రజల మద్దతు ఉందన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలువాలని, పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సోదా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండి సారంగపాణి, ప్రధాన కార్యదర్శి మడికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సివిల్ దవాఖాన అప్గ్రేడ్..
నిజాం కాలం నాటి పరకాల సివిల్ దవాఖాన అప్గ్రేడ్కు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఇందు కోసం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన కృషి అభినందనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల సంజీవయ్య అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దవాఖాన అప్గ్రేడ్ అంశాన్ని ఎమ్మెల్యే చల్లా ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. మూడు జిల్లాల్లోని పలు మండలాల ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న ఈ దవాఖాన త్వరలోనే 100 పడకలుగా రూపాంతరం చెందబోతున్నదన్నారు. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.