భూపాలపల్లి రూరల్ : జిల్లాలో పోషకాహార లోపంతో చిన్నారులెవరు బాధపడకుండా పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో కొనసాగుతున్న పౌష్టికాహార కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పౌష్టికాహార లోపంతో 800మంది బాల బాలికలు బాధపడుతున్నారని వారందరిని రెవెన్యూ విలేజ్, అంగన్వాడీ కేంద్రాల వారీగా గుర్తించి వారికి ప్రత్యేక సంఖ్యను కేటాయించి వారికి రోజు వారీగా అందిస్తున్న పాలు, గుడ్లు, బాలామృతంతో పాటు అదనంగా పాలు, గుడ్లను అందించాలని అన్నారు.
వారం వారం బాలబాలికల బరువులను కొలుస్తూ 30రోజుల లోగా వారు సాధారణ ఆరోగ్య స్థాయికి చేరుకునేలా అంగన్వాడీ సూపర్ వైజర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్, సీడీపీవోలు రాధిక, అవంతిక, అంగన్వాడీ సూపర్ వైజర్లు, పోషక అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.