భూపాలపల్లి: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికుల కోసం సంస్థ నిర్మిస్తున్న994 క్వార్టర్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో 400 క్వార్టర్ల నిర్మాణం వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుందని భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం జనరల్ మేనేజర్ టీ.శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం స్థానిక జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఏరియాలోని కేటీకే 8వ భూగర్భ గని (కేఎల్పీ)లో ప్రస్తుతం10 ఎస్డీఎల్ యంత్రాలు ఉన్నాయని, త్వరలో మరొక ఎస్డీఎల్ను ప్రవేశపెడతామని, ఇందులో ఐదు ఎస్డీఎల్ యంత్రాలను అవుట్సోర్సింగ్ చేయాలని సంస్థ నిర్ణయించిందని, ప్రైవేట్ వారు కేవలం కోల్బ్లాస్టింగ్, సపోర్టింగ్ లోడింగ్ పనులు చేస్తారని, మిగతా పనులు సంస్థ ఉద్యోగులు చేస్తారని, గనిలోని ట్రామర్, కోల్కట్టర్, సపోర్ట్మెన్ కేటగిరిల కార్మికులను 120 మంది వరకు ఏరియాలోని ఇతర గనులకు బదిలీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
మిగతా కార్మికులు ఆ గనిలోనే పనిచేస్తారని జీఎం తెలిపారు. అక్టోబర్ నెలలో ఏరియాలో 55 శాతం బొగ్గు ఉత్పత్తి చేశామని, ఈ నెల నవంబర్లో రోజుకు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి చేరుకున్నామన్నారు. దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, ఉద్యోగులు గైర్హాజరు కాకుండా అందరూ విధులకు హాజరై బొగ్గు కొరత తీర్చడంలో తమవంతుపాత్ర పొషించాలని జీఎం అన్నారు.వ్యాక్సినేషన్ మొదటి విడత పూర్తయిందని, రెండో విడతలో 200 మంది ఉద్యోగులకు వాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఏజీఎం(ఐఈడీ) జోతి, ఏవో రాధకృష్ణ, అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం, సీనియర్ పీవో రాజేశం పాల్గొన్నారు.