భూపాలపల్లి రూరల్ : జిల్లాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వారిచే డీఎంఎఫ్టీ, ఎస్డీఎఫ్, సీడీఎఫ్, ఐఏపీ, సీడీపీ, ఎంపీలాల్డ్, ఎమ్ఆర్ఆర్, 2 బీహెచ్కే, లోకల్ గ్రాంట్, సినరేజ్, ఎన్ఆర్ఈజీఎస్, నాబార్డు, పీఎంజీఎస్వై తదితర 15 గ్రాంట్ల ద్వారా రహదారులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్లు, వైకుంఠధామాలు, రైతు వేదికలు తదితర నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ నిర్మాణాలు అగ్రిమెంట్ ప్రకారం నిర్థేశించిన సమయంలోగా పూర్తి చేసి ఎంబీ రికార్డు చేయాలన్నారు.
ప్రతి రైతు వేదికలో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి విద్యుత్, త్రాగునీరు వసతి సౌకర్యాలను కల్పించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను వేగిరం చేయాలని, జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న గోడౌన్ నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి గోడౌన్కు అవసరమైన ప్రహారి గోడ, ఇతర సౌకర్యాల కొరకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఇప్పటి వరకు వివిధ గ్రాంటుల ద్వారా చేపట్టిన నిర్మాణ పనుల పురోగతి వివరాలు, మండలాలు, సంవత్సరాల వారీగా గడిచిన 5 సంవత్సరాల వివరాలను అందజేయాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులందరూ ఈ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ వెంకటేశ్వర్లు, మహాదేవ్పూర్, చిట్యాల, ఏటూరునాగారం, ములుగు, వెంకటాపురం డీఈలు సాయిలు, ఆత్మారాం, రవీందర్, రామలింగాచారి, మోహన్రావు, రెండు జిల్లాల ఏఈలు పాల్గొన్నారు.