కమ్మర్పల్లి, జూలై 5 : రహదారులను పచ్చని హారాలుగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో వేలాదిగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని రెండు హైవేలకు ఇరువైపులా సరిహద్దుల వరకు మొత్తం 130 కిలో మీటర్ల ప్లాంటేషన్ ప్రణాళిక అమలవుతున్నది. 44వ నంబరు జాతీయ రహదారి వెంట ఇందల్వాయి మండలం నుంచి మెండోరా మండలం వరకు, 63వ నంబరు జాతీయ రహదారి వెంట బోధన్ మండలం నుంచి కమ్మర్పల్లి మండలం వరకు ఈ పనులు 4వ విడుత పల్లె ప్రగతిలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు జాతీయ రహదారులను అడుగడుగునా పచ్చదనంతో నింపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ఈ రెండు హైవేల వెంట రెండు, మూడు వరుసల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఊపందుకున్నది. మొక్కలు నాటడానికి అవసరమైన గుంతల తవ్వకం పనులను శరవేగంగా పూర్తి చేశారు. ఈ హరిత కృషితో జిల్లాలో మన రహదారులు ‘నా దారి.. పచ్చని రహదారి’ అని చెప్పుకునేలా మారనున్నాయి.
అడుగడుగునా మొక్కలుండేలా..
జాతీయ రహదారులకు ఇరువైపులా అడుగడునా మొక్కలు నాటి సంరక్షించేలా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల కింద అవెన్యూ ప్లాంటేషన్ను చేపట్టారు. 63వ నంబరు జాతీయ రహదారిపై బోధన్ మండలం సాలూర నుంచి కమ్మర్పల్లి మండల కేంద్ర శివారులో జిల్లా సరిహద్దు వరకు తొమ్మిది మండలాల్లో 29 గ్రామ పంచాయతీల పరిధిలో 55.4 కి.మీ. మేర ఈ పనులు జరుగుతున్నాయి. బోధన్ మండలం సాలూర, సాలూర క్యాంప్, నాగన్పల్లిలో 4 కి.మీ., ఎడపల్లి మండలం అంబం, ఎడపల్లి, జమ్లం, ఎమ్మెస్సీ ఫారం, బాపూ నగ ర్, పోచారం, జాన్కంపేట్, నెహ్రూనగర్లో 10.7 కి. మీ., మాక్లూర్ మండలం చిన్నాపూర్, మామిడిపల్లి, రాంచంద్రాపల్లి, గుత్ప పరిధిలో 5.7 కి.మీ., డిచ్పల్లి మండలం బర్దీపూర్, ధర్మారం పరిధిలో 3 కి.మీ., జక్రాన్పల్లి మండలం మునిపల్లి పరిధిలో 5.6 కి.మీ., ఆర్మూర్ మండలం అంకాపూర్, చేపూర్ పరిధిలో 6.6. కి.మీ., వేల్పూర్ మండలం లక్కోర, ఒడ్డెర కాలనీ, పడగల్, అంక్సాపూర్, కుకునూర్ పరిధిలో 0.5 కి.మీ., మోర్తాడ్ మండలం దొన్కల్, గాండ్లపేట్, మోర్తాడ్ పరిధిలో 8.7 కి.మీ., కమ్మర్పల్లి మండల కేంద్రం పరిధిలో 5.2. కి.మీ. పరిధిలో మొత్తం 35,686 మొక్క లు నాటే లక్ష్యాన్ని గుర్తించారు.
వెంటనే వీటిని నాటడానికి ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్వించారు. గురువారం వరకు 33,086 గుంతలు పూర్తి చేశారు. 2,576 మొక్కలను నాటారు. 61 వరుసలను గుర్తించి మొక్కలు నాటుతున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం చాంద్రాయన్ పల్లి నుంచి మెండోరా మండలం దూద్గాం వరకు ఆరు మండలాల్లో 33 గ్రామ పంచాయతీల పరిధిలో 75 కి.మీ.లలో 46,670 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం నాటికి 46,175 గుంతల తవ్వకాన్ని పూర్తి చేసి 18,923 మొక్కలను నాటారు. ఇందల్వాయి మండలంలో చాంద్రాయన్పల్లి, దేవీ తండా, గంగారాం తండా, ఇందల్వాయి, తిర్మన్పల్లి పరిధిలో 20 కి.మీ., డిచ్పల్లి మండలంలో బీబీపూర్, దేవ్పల్లి, డిచ్పల్లి, ఘన్పూర్, మెంట్రాజ్పల్లి, నడిపల్లి, నడిపల్లి తండా, నాకా తండా, సాంపల్లి, సుద్దపల్లి, వెస్లీనగర్ పరిధిలో 12.6 కి.మీ., జక్రాన్పల్లి మండలంలో అర్గుల్, బాల్నగర్, చాంద్మియా బాగ్ తండా, జక్రాన్పల్లి, సికింద్రాపూర్, వివేక్ నగర్ తండా పరిధిలో 27 కి.మీ., బాల్కొండ మండలంలోని బాల్కొండ, చిట్టాపూర్, కిసాన్ నగర్, శ్రీరాంపూర్ పరిధిలో 6.5 కి.మీ., ముప్కాల్ మండలంలో కొత్తపల్లి, ముప్కాల్, నల్లూర్, వేంపల్లి పరిధిలో 1.9 కి.మీ., మెండోరా మండలంలో బుస్సాపూర్, దూద్గాం పరిధిలో 7.1 కి.మీ. పొడవునా మొక్కలు నాటనున్నారు.
130 కి.మీ.లక్ష్యం
రెండు జాతీయ రహదారుల వెంట 15 మండలాల్లో 62 గ్రామాల పరిధిలో 130 కిలో మీటర్లలో 147 వరుసలను గుర్తించి మొత్తం 82 వేల మొక్కలు నాటే పనులు చేస్తున్నారు. 42 వేల పొడవాటి మొక్కలు, 25,497 మధ్యస్త ఎత్తు మొక్కలు, 14,284 పొట్టి రకం మొక్కలను నాటనున్నారు.
అధికారులకు సీఎం అభినందన
గుంతల తవ్వకం పనులు శరవేగంగా పూర్తి చేసి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగేలా నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇటీవల సమీక్షలో కలెక్టర్, అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. మండల పరిషత్, గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ పథకం, అటవీ శాఖ, నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనులు సాగిస్తున్నారు.