న్యూఢిల్లీ: ఒలింపిక్స్ అన్న మాట వినిపిస్తే చాలు స్ప్రింటర్ మిల్కాసింగ్ గుర్తు రాకుండా ఉండరని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆలిండియా రేడియోలో జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన.. మిల్కాసింగ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు తనకు ఆయనతో మాట్లాడే అవకాశం దక్కిందన్నారు. ఆ సందర్భంగా ఒలింపిక్స్కు వెళ్తున్న అథ్లెట్లను మోటీవేట్ చేయమని కోరానని ప్రధాని తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్కు వెళ్తున్న ప్రతి ఆటగాడి జీవితంలో తాను ఏండ్ల కొద్దీ అనుభవించిన సంఘర్షణ, ఏండ్ల శ్రమ దాగి ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. ఆటగాళ్లు కేవలం వాళ్ల కోసం మాత్రమే ఒలింపిక్స్కు వెళ్లడంలేదని, అంతర్జాతీయ వేదికపై దేశం పేరు నిలబెట్టడానికి వెళ్తున్నారని ఆయన కొనియాడారు. ఒలింపిక్స్కు ఎంతో మంది ఆటగాళ్లు వెళ్తున్నారని, కానీ వాళ్లలో కొద్దిమంది పేర్లను మాత్రమే తాను ప్రస్తావించగలనని చెప్పారు.
మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ప్రవీణ్ జాదవ్ అద్భుతమైన ఆర్చర్ అని, ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలు అయినా కష్టపడి టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించారని ప్రధాని ప్రశంసించారు. భారత హాకీ టీమ్ సభ్యురాలు నేహా గోయల్ తల్లి, అక్క సైకిళ్ల తయారీ కంపెనీలో పనిచేస్తే కుటుంబాన్ని పోషిస్తున్నారు. అంతటి బీద కుటుంబం నుంచి నేహా గోయల్ ఒలింపిక్స్కు ఎంపిక కాగలిగారు. మహిళా ఆర్చర్ దీపిక కూడా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకుంది.