లక్నో: ఉత్తరప్రదేశ్లో మళ్లీ నగరాల పేర్లను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయోధ్య డివిజన్లో ఉన్న అక్బర్పుర్(Akbarpur) పేరును మార్చాలని ఆ రాష్ట్ర సీఎం యోగి భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆ పేరును ఉచ్ఛరించడం నచ్చడం లేదని, అన్నీ మార్చేస్తామని, వలసవాద గుర్తుల్ని నిర్మూలిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అక్బర్పుర్తో పాటు మరికొన్ని జిల్లాలో పేర్లను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో అలీఘడ్, ఆజమ్ఘడ్, షాజహన్పుర్, ఘజియాబాద్, ఫిరోజాబాద్, ఫరూకాబాద్, మొరాదాబాద్ పేర్లను కూడా మార్చే ప్రక్రియ మొదలైనట్లు భావిస్తున్నారు.
ఇటీవల లక్నోలో అనేక ప్రాంతాల పేర్లను మార్చారు. అటల్ బిహారీ వాజ్పేయి రోడ్డు, అటల్ చౌరాహ్, అటల్ బిహారీ వాజ్పేయి కాన్ఫరెన్స్ సెంటర్, అటల్ సేతు, అటల్ బిహారీ కళ్యాణ్ మండప్ లాంటి పేర్లను జోడించారు. మొఘుల్సరాయి రైల్వే స్టేషన్ను ఇటీవల దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్గా మార్చారు. 2019 కుంభమేళాకు చెందిన అలహాబాద్ను ప్రయాగ్రాజ్గా మార్చారు. ప్రయాగ్రాజ్ పేరును మొఘల్స్ మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం ఫైజాబాద్ను అయోధ్యగా మార్చారు. జాన్సీ రైల్వే స్టేషన్ను రాణీ లక్ష్మీభాయ్ స్టేషన్గా మార్చేశారు. అలీఘడ్ను హరిఘడ్గా మార్చాలని స్థానిక మున్సిపాల్టీలో తీర్మానం పాస్ చేశారు. ఫిరోజాబాద్ను చంద్ర నగర్గా మార్చాలని భావిస్తున్నారు. మెయిన్పురిని మాయాపురిగా మార్చనున్నారు.