జోగులాంబ గద్వాల : కొవిడ్ బారిన పడిన వారిని కాపాడుకోవడం మన బాధ్యత అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కొవిడ్ వార్డును సందర్శించిన అనంతరం అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, అందుకు కారణం ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది చేస్తున్న సేవల వల్లనే ఇది సాధ్యమైందన్నారు.
వైద్యులతో పాటు ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా సేవలందిస్తూ తమ మానవత్వాన్ని చాటుకున్నారని, వారికి ఈ సమాజం రుణపడి ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులకు సైతం వారు దూరంగా ఉంటూ సేవలు అందిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ప్రభుత్వం కరోనా కట్టడి లో భాగంగా ఇంటింటి ద్వారా సర్వే చేయిస్తుందని పేర్కొన్నారు.
ముందుగానే లక్షణాలు గుర్తిస్తూ వారికి మందులు పంపిణీ చేసి కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కరోనా రోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చు అని ధైర్యం చెప్పారు.
అనంతరం కలెక్టరేట్లో కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రి వెంట ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి , అబ్రహం, జెడ్పీ చైర్ పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ రఘురామ శర్మ, ఎంహెచ్వో చందు నాయక్, ఆర్ డి ఓ రాములు తదితరులు పాల్గొన్నారు.