బుధవారం ఒక్క రోజే 40వేల మంది హాజరు
కోలాహలంగా మారిన అడవి
తాడ్వాయి, జనవరి 19 : వరాలిచ్చే దేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మలకు ముందస్తు మొక్కుల సందడి మొదలైంది. అమ్మవార్ల మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. సారలమ్మ గద్దెపై కొలువుదీరే రోజు బుధవారం కావడంతో తెలంగాణతో పాటు సమీప రాష్ర్టాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్నారు. సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. యాటపోతులు, కోళ్లను బలిచ్చి జాతర పరిసరా ల్లో వంటలు చేసుకుని విందు భోజనాలు చేశారు. సుమారు 40 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. కాగా, వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులు గద్దెల సమీపంలో ఉన్న గ్రానైట్ రాళ్లపై కొబ్బరికాయలు కొడుతుండడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తులు కానుకలు సమర్పిం చేందుకు హుండీలకు మూతలు వేసి ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏఎస్పీ
వనదేవతలను ములుగు ఏఎస్పీ ఎస్ఆర్ కేకన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఆయనకు పూజారులు, దేవాదాయశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికి తల్లుల గద్దె ల వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవా రి వస్ర్తాలతో పాటు ప్రసాదాన్ని పూజారులు అందజేశారు.