సుబేదారి, జనవరి 19: బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లతో నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.56 లక్షల విలువైన సామగ్రి, వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హనుమకొండలోని సుబేదారి టాస్క్ఫోర్స్ కార్యాలయంలో బుధవారం టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ముగ్గురు నిందితుల అరెస్టును చూపించి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన కతిరియా అవినాశ్, హనుమకొండ బ్రాహ్మణవీధికి చెందిన వజ్రపు నరసింహమూర్తి, వరంగల్ సుందరయ్యనగర్కు చెందిన యోనగంటి రాకేశ్ కలిసి హైదరాబాద్లోని వివిధ కంపెనీల పేరుతో నకిలీ వస్తువులను తయారు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు విక్రయిస్తున్నారు. వాటిపై బ్రాండెడ్ కంపెనీల పేరుతో స్టిక్టర్లు వేసి, నకిలీ వస్తువులను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. వీరు తయారు చేసిన నకిలీ బూస్ట్తో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. పక్కా సమాచారం మేరకు నకిలీ వస్తువులు విక్రయిస్తున్న వీరిలో ముగ్గురిని హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లికి చెందిన హీరాలాల్ బిష్ణోయ్, గోషామహల్కు చెందిన ఘేవర్రాం, అఫ్జల్గంజ్కు చెందిన మోహర్రామ్పటేల్ పరారీలో ఉన్నట్లు వివరించారు. వీరి నుంచి రూ. 1.56 లక్షల విలువైన నకిలీ వస్తువులు, ఒక మారుతి వాహనం, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ సీఐలు శ్రీనివాస్జీ, సంతోష్, ఎస్సై లవన్కుమార్ను అభినందించారు.
చిన్నారులకు వెట్టి నుంచి విముక్తి కల్పిద్దాం
చిన్నారులను వెట్టిచాకిరి నుంచి కాపాడుకుందామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. సీపీ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ హనుమకొండలోని సీపీ కార్యాలయంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల చైల్డ్వెల్ఫేర్, చైల్డ్ ప్రొటెక్షన్, కార్మికశాఖ అధికారులతో సమీక్షించారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 9491089257 వాట్సాప్ నంబర్కు సమాచారం అందిచాలని కోరారు. సమావేశంలో మూడు జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు అనిల్ చందర్రావు, వసుధ, ఉప్పలయ్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు వినోద్కుమార్, శ్రీధర్బాబు, రాజకుమారి పాల్గొన్నారు.