కనులపండువగా వసంతోత్సవం.. త్రిశూల స్నానం
ఆకట్టుకున్న వీర శైవుల విన్యాసాలు
కొత్తకొండకు పోటెత్తిన జనం
భీమదేవరపల్లి, జనవరి 17: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో స్వామి వారికి నాగవెల్లి, వసంతోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవ మూర్తులకు వసంత మండపంలో నీల లోహిత పూజ నిర్వహించారు. భద్రకాళి అమ్మవారికి నల్లపూసలను ధరింపజేశారు. అనంతరం ఊయల ఊపి సప్తవర్ణాల ఏకాంతసేవ నిర్వహించారు. ఏకాంతసేవలో తేజోరూపుడై ఉన్న స్వామివారిని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సోమవారం త్రిశూలస్నానం కార్యక్రమం కనులపండువగా జరిగింది. గణపతిపూజ, గవ్యాంతం, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకురాగా, ఆలయ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో ఉడుతల వెంకన్న, ధర్మకర్తలు ఎల్తూరి ప్రభాకర్, పెదబోయిన హరికృష్ణ, నోముల రాజు, కాల్వ సునీత, మఠం శ్రీశైలం, భూక్య తులస్య, అర్చకులు తాటికొండ వీరభద్రయ్య, ఆలయ మాజీ చైర్మన్ మారుపాటి మహేందర్రెడ్డి కలశాలను ఎత్తుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా రాయదుర్గానికి చెందిన వీరశైవులు మంగళవాయిద్యాల మధ్య వీరభద్ర పల్లెరం చేశారు. వీరశైవులు విన్యాసాలు చేయగా ఉత్సవమూర్తులను, త్రిశూలకలశాలను పవిత్ర కోనేరుకు తీసుకెళ్లి స్నపనం నిర్వహించారు. అనంతరం భక్తులు కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించారు. త్రిశూల స్నానం చేయడం వల్ల శారీరక రుగ్మతలు తొలగి శరీరం కాంతివంతమైతదని భక్తుల విశ్వాసం.
కిక్కిరిసిన క్యూలైన్లు
కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చాలని కోరమీసాలు సమర్పించారు. తమ గండాలు తొలగిపోవాలని గండదీపం వద్ద నూనె పోశా రు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కోడె మొక్కులు చెల్లించారు. ఆలయ పాలక వర్గం, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, పోలీసులు భక్తులకు సేవలందించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పోలీసులు కంట్రోల్ రూం ద్వారా మైకు ల్లో ప్రకటించి అవగాహన కల్పించారు. భక్త జనం తాకిడి ఎక్కువ కావడంతో సర్కస్, రంగుల రాట్నం, జాతరలో వెలసిన దుకాణాలు సందడిగా మారాయి.
నేడు అగ్నిగుండాలు, స్వామి గ్రామ పర్యటన
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేకువజామున అగ్నిగుండాల కార్యక్రమం జరుగనుంది. శరభ..శరభ.. అంటూ భక్తులు నిప్పుకణికలపై భక్తిపారవ శ్యంతో నడుస్తారు. అదే రోజున సాయంత్రం స్వామివారి గ్రామ పర్యటన ఉంటుంది.