తొర్రూరు, జూలై 11: మండలంలోని వెలికట్ట, భోజ్యాతండాలో పిడుగుపడి, విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. భూక్యా సుధాకర్, మాలోత్ యాకూబ్ అనే ఇద్దరు రైతులు శనివారం విద్యుత్షాక్తో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. సుధాకర్ భార్యకు ప్రభుత్వ తరఫున ఉద్యోగం ఇప్పించడం లేదా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వెలికట్టలో పిడుగుపాటుకు మృతి చెందిన కొమ్ము సాయమ్మ, అమరేశ్వరీ కుటుంబాలను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన కొమ్ము ఉపేంద్ర ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని రూ.10వేల సాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, సర్పంచులు పుష్పలీల, కాలూనాయక్, ఎంపీటీసీ మల్లమ్మ, డీఎస్పీ వెంకటరమణ, సీఐ కరుణాకర్రావు పాల్గొన్నారు.
గుర్తూరు ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యుడు సింగారం యాకయ్య ఇటీవల మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2లక్షల పరిహారం చెక్ను యాకయ్య భార్య యాకమ్మకు తొర్రూరులో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి బుజ్జిబాబు, సహాయ అధికారి యాకయ్య, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తూరు రమేశ్, ప్రధాన కార్యదర్శి చంద్రమూర్తి, గుర్తూరు సొసైటీ అధ్యక్షుడు సింగారం శ్రీనివాస్, ఐలయ్య, రాములు, రాంనర్సయ్య పాల్గొన్నారు.