ఏటా వరి సాగు చేస్తే భూసారం తగ్గుతుంది
రైతులకు కలెక్టర్ శశాంక సూచన
నర్సింహులపేట, దంతాలపల్లిమండలాల్లో పర్యటన
పంటలు, కొనుగోలు కేంద్రాల పరిశీలన
నర్సింహులపేట/దంతాలపల్లి, డిసెంబర్ 8: యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగుచేసుకోవాలని కలెక్టర్ శశాంక రైతులకు సూచించారు. బుధవారం నర్సింహులపేట మండలం పడమటిగూడెంలో వేరుశనగ పంట, వంతడుపుల, నర్సింహులపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రామన్నగూడెంలో బొప్పాయి తోట, దంతాలపల్లి మండలం గున్నెపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం, గ్రామంలో సాగుచేసిన మొక్కజొన్న, మిరప, వేరుశనగ పంటలను పరిశీలించారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్ మాట్లాడారు. ఏటా వరి సాగు చేయడం వల్ల భూసారం తగ్గుతుందని చెప్పారు. ఎఫ్సీఐ యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించి వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లను ఏర్పాటు చేశామని, రైతులు ధాన్యాన్ని తక్కువ తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. యాసంగిలో వరి సాగు తగ్గించి, ఆరుతడి పంటలపై దృష్టిపెట్టి లాభాలు పొందాలని సూచించారు. నర్సింహులపేట ఎంపీపీ టేకుల సుశీల, పీఏసీఎస్ చైర్మన్ సంపెట రాము, డీఏవో చత్రునాయక్, ఉద్యానశాఖ జిల్లా అధికారి సూర్యనారాయణ, తహసీల్దార్ ఇమాన్యుయేల్, వైస్ ఎంపీపీ జాటోతు దేవేందర్, హెచ్వో రాకేశ్, రామకృష్ణ, సర్పంచ్ జొన్నగడ్డ యాదలక్ష్మి, గుగులోతు రవి, పాతూరి మధు, వెంకన్న, జడ్పీ వైస్ చైర్మన్ నూకల వేంకటేశ్వర్రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ సంపెట రాము, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ వలాద్రి మల్లారెడ్డి, తహసీల్దార్ అబిద్అలీ, ఎంపీడీవో గోవిందరావు, ఏవో కుమార్యాదవ్, సర్పంచ్ గండి వెంకటనారాయణ పాల్గొన్నారు.
రేబిస్ నివారణ టీకాలు వేయించాలి
మహబూబాబాద్, డిసెంబర్ 8: వీధి, పెంపుడు కుక్కలకు రేబిస్ నివారణ టీకాలు వేయించాలని కలెక్టర్ శశాంక అనారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పశువైద్య, పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ప్రతి గురువారం కుక్కలకు రేబీస్ టీకాలు ఉచితంగా వేయాలన్నారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోదించేందుకు సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్క్రూయాల్టీ టూ యానిమల్స్(ఎస్పీసీఏ)కార్యకలాపాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని పశువుల ఆస్పత్రుల్లో ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.