దుకాణాల్లో విచ్ఛలవిడిగా వినియోగం
కలెక్టర్ ఆదేశించినా లేని ప్రయోజనం
షాపుల్లో తనిఖీలు చేపట్టని అధికారులు
జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ప్లాస్టిక్ చెత్త
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 7 (నమస్తే తెలంగాణ) :ప్లాస్టిక్పై నిషేధం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు. ప్రధానంగా జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు, ఇతర వస్తువులు విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు. వీధి వ్యాపారులు, కూరగాయల విక్రయదారుల వద్ద, పలు వ్యాపార సంస్థలు, కిరాణా షాపుల నిర్వాహకులు, హోటళ్లు, మటన్, చికెన్ షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడితే కఠినచర్యలు తీసుకోవాలని, ఇందుకు తనిఖీలు చేయాలని కలెక్టర్ గతంలో ఆదేశించారు. మొదట్లో కొద్దిరోజులు చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆ తర్వాత నిర్లక్ష్యం వహించారు. దీంతో ప్లాస్టిక్ వాడకంపై మళ్లీ యథావిధిగా పెరిగిపోయింది.
జిల్లాలో ప్లాస్టిక్ కవర్ల వాడకం విచ్చలవిడిగా కొనసాగుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ఇతరాలపై నిషేధం ఉన్నప్పటికీ ఎక్కడా అమలు కావడంలేదు. జిల్లా కేంద్రంలో ఏ షాపులో చూసినా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ చెత్త పెరిగిపోతోంది. పలు వ్యాపార సంస్థలు, కిరాణా షాపుల నిర్వాహకులు, వీధి వ్యాపారులు, కూరగాయల విక్రయదారులు, హోటళ్లు, మటన్, చికెన్ షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా వాడుతున్నారు.
అమలు కాని కలెక్టర్ ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ఇతరాలను నిషేధించాలని కలెక్టర్, అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని, జిల్లా కేంద్రాన్ని ప్లాస్టిక్ చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ చెప్పారు. ప్లాస్టిక్ కవర్లను మూగజీవాలు తినడం వల్ల చనిపోతున్నాయి. దీంతో ప్లాస్టిక్ వాడకంపై తనిఖీలు చేపట్టి కఠినంగా వ్యవహరించాలని ఉద్యోగులు, అధికారులను ఆదేశించారు. కానీ వారు నిర్లక్ష్యం వహిస్తుండడంతో జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ కవర్ల వాడకం ఏమాత్రం తగ్గడంలేదు. మున్సిపాలిటీ నుంచి ఒక్కసారి మాత్రమే ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
జిల్లాలో ప్లాస్టిక్పై నిషేధం అమలులో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. దీంతో ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరిగినట్లు తెలుస్తున్నది. గతంలో కలెక్టర్ ఆదేశాలతో వారం రోజుల పాటు తనిఖీలు కొనసాగాయి. ప్రస్తుతం తనిఖీలను నిలిపివేయగా పరిస్థితి యథావిధిగా మారినట్లు స్థానికులు అభిప్రాయం పడుతున్నారు.
111 కేసులు నమోదు చేశాం
జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధంపై స్పెషల్డ్రైవ్లను నిర్వహించాం. ప్లాస్టిక్ వాడుతున్న 111 మందిపై కేసులు నమోదు చేశాం. వారి నుంచి రూ.1.50లక్షల జరిమానాలను వసూలు చేశాం. ప్రస్తుతం ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నందున తనిఖీలను నిలిపి వేశాం.