ములుగు,జూలై27(నమస్తేతెలంగాణ) : అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు మావోయిస్టులు స్వచ్ఛందంగా ములు గు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. మంగళవారం ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ వారి వివరాలను విలేకరులకు వెల్లడించారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు ఛత్తీస్గఢ్ రాష్ట్ర దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోని సౌత్ బస్తర్ డీవీసీ 8వ ప్లాటూన్కు చెందిన ముచ్చాకి జోగా(25), అదే ప్లాటూన్ దళ సభ్యురాలు పూనం బుద్రి(24) అనారోగ్యం తో బాధపడుతూ లొంగిపోయినట్లు వివరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోని తన గ్రామంలో జోగా కూలి పనులు చేసుకుంటుండగా మావోయిస్టు పార్టీ కమాండర్గా ఉన్న దస్రూ అతడి గ్రామంలో సమావేశాలు నిర్వహించేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడి ప్రసంగాలతో ఆకర్షితుడైన ముచ్చాకి జోగా 2015లో 8వ ప్లాటూన్లో దళ సభ్యుడిగా చేరాడన్నారు. 15 రోజుల శిక్షణ అనంతరం ఇప్పటి వరకు ఏసీఎం స్టేటస్ కమాండర్ అండర్ కంట్రోల్లో పనిచేశాడన్నారు.
అలాగే, పూనెం బుద్రి 2015లో మావోయిస్టు పార్టీలో సభ్యురాలిగా చేరి, పామేడ్ ఏరియాలో సీఎన్ఎం దళంలో సభ్యురాలిగా ఏడాదిన్నర పాటు, పాపారావు దళంలో ఏడాది, డీజీఎం డాక్టర్ దళంలో ఏడాది పనిచేసిందన్నారు. చివరగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సౌత్ బస్తర్ 8వ ప్లాటూన్లో చేరి మూడేళ్లుగా డీసీఎంగా పనిచేసిందన్నారు. పార్టీ నాయకులు కొంత కాలంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మారుమూల అటవీ ప్రాంత ప్రజలను భయపెట్టి, సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి దళంలో పెరిగిందన్నారు. చాలా మంది మావోయిస్టులకు వైరస్ సోకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. రెండు నెలల వ్యవధిలో కుర్సం గంగ య్య అలియాస్ ఐతు, గడ్డం మధూకర్, నందు, సోబరాయ్, హరిభూషణ్, భారతక్క, ప్రకాశ్ అనే మావోయిస్టు నాయకులు కరోనాతో మరణించినట్లు తెలిపారు. అయినా మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం పరిస్థితిని దాచిపెట్టి చికిత్స కోసం బయటకు అనుమతించపోవడం వల్ల సభ్యుల్లో ఆందోళన మొదలైందన్నారు. ఈ కారణాలతోనే ఈ ఇద్దరు మావోయిస్టు సభ్యులు అజ్ఞాతం వీడి బయటకు వచ్చి లొంగిపోయారన్నారు.
కరోనా సోకిన మావోయిస్టు పార్టీ సభ్యులు, ముఖ్య నాయకులు ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి, పోలీసులను ఆశ్రయిస్తే వారికి మెరుగైన చికిత్స అందించి, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతిఫలాలను అందజేస్తామని ఎస్పీ వెల్లడించారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టులకు ఎస్పీ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ఓఎస్డీ శోభన్కుమార్, ఏఎస్పీ సాయిచైతన్య, పస్రా సీఐ శ్రీనివాస్, ఎస్సై రవీందర్, మహిళా ఎస్సై మౌనిక పాల్గొన్నారు.