జనగామ చౌరస్తా, నవంబర్ 28 : మారుమూల ప్రాంతాలకు సైతం రవాణాపరంగా సేవలందిస్తున్న ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా బలపడుతున్నది. రెండో దశ లాక్డౌన్ తరువాత జనగామ డిపో లాభాల బాట పట్టింది. ప్రస్తుతం డిపోలో సంస్థకు చెందిన 86 బస్సులుండగా, 42 హైర్ బస్సులున్నాయి. ప్రతిరోజు 43 రూట్లలో బస్సులను నడుపుతున్న ఆర్టీసీ ప్రయాణికులకు టికెట్లు, బస్పాస్ల విక్రయాల ద్వారా ఏడాదికి రూ 4.50 కోట్లు సమకూరుతున్నది. డిపోలోని బస్సులు ప్రతిరోజూ సుమారు 49 వేల కిలో మీటర్లు నడుస్తూ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. దీంతో ఆక్యుపెన్సీ సైతం పెరిగింది. రెండో దశ లాక్డౌన్ తర్వాత అత్యధికంగా ఈ నవంబర్ నెలలో డిపోకు 68 శాతం ఆక్యుపెన్సీ రావడం విశేషం. సుశిక్షితులైన డైవర్లు, సిబ్బందితో బస్సు సర్వీస్లను నడుపుతుండడంతో ప్రయాణికులకు మెరుగైన సేవలందుతున్నాయి. దీంతో జనగామ డిపో లాభాల బాటలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కార్గో పార్సిల్ సర్వీసుల ద్వారా నెలకు రూ 2 లక్షల ఆదాయం వస్తున్నది. ఆర్టీసీ డిపో పరిధిలో నిర్వహిస్తున్న హెచ్పీసీఎల్ బంకు ద్వారా రోజుకు 5 వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా రోజుకి రూ 5 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. డిపో ఆవరణలోని వ్యాపార సంస్థల ద్వారా నెలకు రూ 10 లక్షల ఆదాయం లభిస్తున్నది. బస్ పాస్లు ద్వారా రోజుకు రూ 50 వేల ఆదాయం వస్తుంది. ఇవే కాకుండా వివాహాది శుభకార్యాలకు నడుపుతున్న ప్రత్యేక సర్వీసులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఇటీవల ఆర్టీసీ బస్సు సర్వీసును పెళ్లిల్లకు బుక్ చేసుకున్న వారి కోసం నూతన దంపతులకు డిపో నుంచి ప్రత్యేక కానుకలను అందజేస్తున్నారు.
లాక్డౌన్ అనంతరం బస్సు సర్వీసుల పునరుద్ధరణ
రెండోదశ లాక్డౌన్ అనంతరం పలు గ్రామాలకు నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. చేర్యాల సెక్టార్లోని ఆకునూర్, వంగపల్లి, రామరాజుపల్లి, సిద్దిపేట వయా బందారం, నాగిరెడ్డిపల్లి, కొన్నె, మచ్చుపహాడ్ గ్రామాలకు ప్రస్తుతం బస్సు సర్వీసులను యథావిధిగా నడుపుతున్నారు. ప్రజల కోరిక మేరకు త్వరలో మరిన్ని రూట్లలో బస్సు సర్వీసులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
శబరిమల క్షేత్రానికి ప్రత్యేక సర్వీసులు
జనగామ డిపో నుంచి కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి వెళ్లే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం వారు కోరుకున్న రూట్లలో ప్రత్యేక సర్వీసులు నడపడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 36 మందితో లేదా భక్తులతో శబరిమలకు వెళ్లే ప్రయాణికులకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బస్సులో మరో ఐదుగురు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. ఉచితంగా ప్రయాణించే వారిలో ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట మనుషులు, లగేజి అటెండెంట్కు అవకాశం ఇస్తున్నారు.
కార్గో సర్వీసులతో నెలకు రూ.2 లక్షల ఆదాయం
సుశిక్షితులైన డ్రైవర్లతో బస్సు సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ సంస్థ ప్రైవేట్కు దీటుగా కార్గో సర్వీసులను నిర్వహిస్తున్నది. జనగామ డిపో నుంచి వివిధ రూట్లలో వెళ్లే బస్సు సర్వీసులను సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో ప్రతిరోజు శానిటైజ్ చేస్తున్నారు. రెండో దశ కరోనా అనంతరం జనగామ డిపోకు ప్రయాణికుల బస్సు టికెట్లు, పాస్ల ద్వారా ఏడాదికి రూ 4.50 కోట్ల ఆదాయం సమకూరింది. కార్గో పార్సిల్ సర్వీసు ద్వారా నెలకు రూ 2 లక్షల చొప్పున లభిస్తున్నది. ఈ ఏడాదిలో సుమారు రూ 20 లక్షలు లభించాయి. ఈ నవంబర్ నెలలో అత్యధికంగా 68 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. ఆర్టీసీ సిబ్బందితో నిర్వహిస్తున్న బంకులో పెట్రోల్, డీజిల్ విక్రయాలతో రోజుకు రూ.5 లక్షల ఆదాయం వస్తుంది. దీనిని పరిశీలిస్తే ఆర్టీసీ అంటే ప్రజలకు ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. సురక్షిత ప్రయాణంతోపాటు తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి చేరవచ్చు.
-ఎన్ లక్ష్మీధర్మనాయక్, జనగామ డిపో మేనేజర్