అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్లబోధన
పూర్వ ప్రాథమిక విద్యతోపాటు ఇంగ్లిష్
కాన్వెంట్లకు దీటుగా ఆంగ్లమాధ్యమం
ఎల్కేజీ, యూకేజీల వారీగా పుస్తకాలు
ప్రతిభ ఆధారంగా పిల్లలకు ప్రత్యేక స్టార్స్
జనగామ, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు వారికి మెరుగైన విద్య అందించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంది. సన్నబియ్యం భోజనంతోపాటు ఆటపాటలతో ఆంగ్లబోధన అందిస్తున్నది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల ప్రాజెక్టుల పరిధిలో 695 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో ఏడు నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు 3,056 మంది, ఏడాది నుంచి మూడేళ్ల వయసున్నవారు 8,873 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లున్న పిల్లలు 7,043 మంది ఉన్నారు. వీరికి పూర్వ ప్రాథమిక విద్య అందిస్తూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారు. ప్రతిరోజూ ఒక ఆంగ్ల పదం, నెలకో పద్యం నేర్పించేలా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి చిన్నారుల ప్రతిభకు తగినట్లు స్టార్స్ కేటాయిస్తున్నారు. కార్పొరేట్కు దీటుగా పిల్లలకు విద్యనందిస్తుండడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పసిప్రాయంలో తమ పిల్లలను సంరక్షించే కేర్టేకర్ కేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలు గా ఉన్నాయని తల్లిదండ్రులు భావిస్తున్న నేపథ్యంలో వీటిలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంగ్లిష్ విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలకు ఆంగ్ల బోధన కావాలని ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యతోపాటు చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బోధిం చి నాణ్యమైన విద్యను అందిస్తున్నది. కార్పొరేట్, ప్రైవే ట్ కాన్వెంట్లకు ధీటుగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రా ల్లో ఇప్పటికే ఈవిధానం అమల్లోకి రాగా ఇటీవల నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. చిన్నారులను మూ డు విభాగాలుగా విభజించి ఆటపాటలతో కూడిన విద్యను అందించడం సహా ప్రతిరోజు పిల్లలకు ఒక ఆంగ్ల పదం, నెలకు ఒక ఆంగ్ల పద్యం నేర్పించేలా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి చిన్నారుల ప్రతిభకు తగినట్లుగా స్టార్స్ కేటాయిస్తున్నారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నాణ్యమైన ఆంగ్ల విద్యాబోధన అందుబాటులోకి రావడంతో పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం సహా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజు మంచి భోజనం, ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత రెండేన్నరేళ్ల నుంచి పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో వదిలి వెళ్తున్న తల్లిదండ్రులు ఆ తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకొని నర్సరీలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తున్నారు. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించి చిన్నారులకు సన్నబియ్యం భోజనంతోపాటు ఆటపాటలతో ఆంగ్లబోధన అందిస్తున్నారు. మూడేండ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అలవాటు చేసే విధానం అమలు చేస్తున్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తీసుకున్న వినూత్న కార్యక్రమాల ఫలితంగా కాన్వెంట్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యంతోపాటు నాణ్యమైన ఆంగ్లవిద్య సైతం అందుబాటులోకి రావడంపై సర్వత్రా తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని మూడు ప్రాజెక్టుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్లబోధన అమల్లోకి వచ్చింది. ఆంగ్ల విద్య బోధనపై టీచర్లకు శిక్షణ ఇచ్చి వారి సౌలభ్యం కోసం పుస్తకాలు అందజేశారు. కాన్వెంట్లకు వేలాది రూపాయలు వెచ్చించి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను అందించలేక పోతు న్న తల్లిదండ్రులకు ఈవిధానం ద్వారా మేలు చేకూరినట్లయింది.
ఆటపాటలతో ఆంగ్ల బోధన..
ఆంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను మూడు విభాగాలు విభజించి ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు ప్లాస్టిక్ బొ మ్మలు, ఇతర ఆట వస్తువులతో ఆటాపాటలు నేర్పిస్తున్నారు. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలను ఎల్కేజీగా విభజించి, ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాల సహాయంతో ఆంగ్లవిద్యను బోధిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యతోపాటు చిత్రలేఖనం వంటి అంశాలపై కూడా పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. 4 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో కూడిన ఆంగ్ల విద్యను అందిస్తున్నారు. ప్రతిరోజు ఆర్ట్, క్రాప్టు, భాషా పరిచయం, నేను-నా పరిసరాలు వంటి అంశాలను వివరిస్తున్నారు. ప్రతిరోజూ వర్క్బుక్లో పిల్లలతో హోంవర్క్ చేయిస్తున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు సామర్ధ్య పరీక్షలు ఎలా నిర్వహిస్తారో ప్రస్తుతం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో సైతం అదే విధానం అమలు చేస్తున్నారు. సామర్ధ్య పరీక్షల ప్రతి భ ఆధారంగా విద్యార్ధులకు ప్రత్యేక గ్రేడ్ కేటాయిస్తున్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిరోజు ఆయా అంశాలపై అవగాహనతో కూడిన విద్యను అందిస్తున్నారు. మొత్తం ఆరు అంశాల ప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నారు. శారీరక, సామాజిక, వ్యక్తిగత భావోద్వేగ, మేధోవికాసం, భాషా, నేర్చుకునే రీతులు, బడికి సంసిద్ధత వంటి అంశాల ప్రాతిపదికన విద్యను అందిస్తున్నారు. టీచర్ పాఠాలు నేర్పిన తర్వాత చిన్నారులు స్వయంగా చేసి చూపితే మూడు స్టార్లు, టీచర్ లేదా ఆయా సహకారంతో చేస్తే రెండు స్టార్లు, ఏవిధంగా చేసి చూపట్టకపోతే ఒక స్టార్ కేటాయిస్తున్నారు. ప్రతిభ సామర్ధ్య పరీక్షల ఫలితాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లల తల్లిదండ్రులకు అందిస్తున్నారు. కేంద్రాల్లో జరిగే ఈసీసీఈడే రోజున ప్రోగ్రెస్ కార్డును తల్లిదండ్రులకు చూపించి వారి సంతకాలు తీసుకుంటున్నారు. వెనకబడిన చిన్నారులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల కళకళ..
చిన్నారులకు ఆంగ్ల విద్య బోధన, గర్భిణిలు, బాలింతలకు సంపూర్ణ వైద్యం, సన్నబియ్యం సమతుల్యంతో కూడిన పౌష్టికాహారం అందిస్తుండడంతో కరోనా తర్వా త జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 695 అంగన్వాడీ కేంద్రాల్లో 656 మొయిన్ అంగన్వాడీ కేంద్రాలు న్నాయి. 39 మినీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి ఆరేళ్ల పిల్లల కోసం ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయం త్రం 4 గంటల వరకు కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి ఏడాది వయస్సు పిల్లలు 3,056 మంది, సంవత్సరం నుంచి మూడేళ్ల వయస్సు పిల్లలు 8,873 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయస్సున్న 7,043 మంది పిల్లలకు కేంద్రాల్లో అనుబంధ పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, వ్యాధినిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నారు.