మారుమూల గ్రామాలకూ ప్రయోజనం
తక్కువ సమయంలో వినియోగదారుల వద్దకు పార్సిళ్లు
అత్యల్ప ధరలకే సేవలతో ప్రజల మన్ననలు
కరోనా నేపథ్యంలో వ్యాపారులకు అత్యంత మేలు
ఉట్నూర్, మే 7: ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతున్న తరుణంలో కార్పొరేషన్ను లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం కార్గో సేవలను ప్రజల ముం దుకు తీసుకొచ్చింది. మారుమూల గ్రామాలకు సైతం సేవలు అందిస్తున్నది.తక్కువ సమయం లో ప్రజల వద్దకు చేరుకోవడంతో పాటు పార్సిల్ పూర్తి బాధ్యత ఆర్టీసీ తీసుకుంది. దీంతో కార్గో సేవలు ప్రజలను తొందరగా చేరుకోగలిగాయి. ఉట్నూర్ ఏజెన్సీలోనిగ్రామాల్లో కొరియర్ పార్సిళ్ల సంస్థల సేవలు లేకపోవడంతో కార్గో సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఐదు మండలాలకు సేవలు
ఏజెన్సీ పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, జైనూర్ మండలాల పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉట్నూర్ కేంద్రంగా 2020 జూలైలో కార్గో సేవలు ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు లేని సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పట్టణం నుంచి ఇతర ప్రాంతాలకు కవర్లు, పార్సిళ్లు పంపేందుకు అవకాశాలు పెరిగాయి. ప్రస్తుత కరోనా నేపథ్యంలో వ్యాపారులు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. వారికి కావాల్సిన సామగ్రిని బుక్ చేయడంతో నేరుగా తమ ప్రాంతాలకు చేరుకుంటుండడంతో యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రమంతటా ఒకే రేటు
ఆర్టీసీ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాక, ప్రైవేట్ పార్సిళ్ల ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా రేట్లు తీసుకోకుండా అదుపులోకి వచ్చాయి. 250 గ్రాముల ప్యాక్కు రూ. 30, 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు రూ.40 ఇలా కార్గో సేవలు తక్కువ ధరలకే ప్రజలకు సేవలు అందిస్తున్నది. పార్సిళ్లను తొందరగా, తక్కువ రేట్లలో అందించేందుకు కృషిచేస్తున్నారు.
పూర్తి భద్రత కల్పిస్తున్నాం
ఉట్నూర్ డివిజన్ కేంద్రంగా కార్గో సేవలు ప్రారంభించినప్పటి నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్గో ద్వారా ప్రజలకు పూర్తి భద్రత మధ్య సేవలు అందిస్తున్నాం. తక్కువ రేటు, తక్కువ సమయంలో ఇతర సంస్థలకు దీటుగా సేవలు అందుతున్నందుకు సంతోషంగా ఉంది. మా వద్ద బుక్ చేసిన పార్సిళ్లకు చాలా భద్రత ఉంది. కావున తమ సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలి.