జనగామ చౌరస్తా, అక్టోబర్ 18 : జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఏ భాస్కర్రావు అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల నవంబర్ 3వ తేదీ వరకు ఉదయం 9.గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పూర్తిగా శానిటైజేషన్ చేసి, థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం మాస్కులు ధరించిన విద్యార్థులను మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. ఇన్విజిలేటర్స్ కరోనా పరీక్షలు చేసుకొని విధులకు హాజరుకావాలని అన్నారు. కరోనాతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి, ఫ్లైయింగ్ స్కాడ్, శానిటేషన్, వైద్య సిబ్బందిని ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బీ శ్రీనివాస్, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో కృష్ణవేణి, జనగామ ఏసీపీ జీ కృష్ణ, డీపీవో రంగాచారి, డీఈవో రాము, ఆర్టీసీ డీఎం లక్ష్మీధర్మ, డిప్యూటీ వైద్యాధికారి కరుణశ్రీ, ఇంటర్ బోర్డు అధికారులు ధర్మేంద్ర, విద్యా సాగర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్సింహా పాల్గొన్నారు.