స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ గాది లింగప్ప
మిర్చి రైతులకు రాయితీపై ఉపకరణాలు అందజేస్తాం
జాతీయ మిర్చి టాస్క్ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివారెడ్డి
వెంకటాపూర్, నవంబర్ 10: నాణ్యతా ప్రమాణాలతోనే మిర్చి పంటకు మార్కెట్లో అధిక ధర లభిస్తుందని స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాది లింగప్ప అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రామప్ప రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షుడు నరెడ్ల వేణు అధ్యక్షతన స్పైసెస్ బోర్డు నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమానికి లింగప్ప ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మిర్చిలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన పరదాలను సబ్సిడీపై పంపిణీ చేసస్తామని అన్నారు. రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలు పొందాలని అన్నారు. జాతీయ మిర్చి టాస్క్ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివారెడ్డి మాట్లాడుతూ త్వరలో రామప్ప రైతు ఉత్పత్తి దారుల సంఘానికి 90 శాతం రాయితీపై మిర్చి మినీ ప్రాసెసింగ్ యూనిట్ను మంజూరు చేస్తామని, శిక్షణా కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తామని అన్నారు. వరంగల్ ఆర్ఏఆర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న మాట్లాడుతూ మిర్చిలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని, మితిమీరిన వినియోగం అనర్థమని రైతులకు సూచించారు. పోటాష్ ఎరువును తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా అందిచాలని, మిర్చిలో పైముడత నివారణకు పిప్రోనిల్ ఎకరాకు 400 మిల్లీటర్లు వాడాలని, జిగురు ఆట్టలు తప్పనిసరిగా వినియోగించాలని, ఒకటి కంటే ఎక్కువ మందులు కలిపి వాడవద్దని అన్నారు. అనంతరం మిర్చి పంట చేలకు వెళ్లి క్షేత్ర సందర్శన చేసి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మొడబోయిన అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కుమారస్వామి, ఏఈవో అనూష, రామప్ప రైతు ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు రాజయ్య, ఐలయ్య, జనార్దన్, పర్వతాలు, నరేందర్, భారతీయ కిసాన్ సంఘ్ బాధ్యులు లేగల శ్రీనివాస్, నాయకులు మెట్టు సురేశ్, స్పైసెస్ బోర్డు సిబ్బంది శరణప్ప, వీరయ్య, రైతులు పాల్గొన్నారు.