గూడూరు, అక్టోబర్ 2: ప్రతిపక్షాల ఊకదంపుడు మాటలు ప్రజలు నమ్మడంలేదని, ఇప్పటి వరకు కాంగ్రెస్పార్టీకి హుజూరాబాద్లో అభ్యర్థి గతిలేడని, వారికి డిపాజిట్ కూడా రాదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్హాలులో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల బాధ్యులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేని సైనికుల్లాంటి కార్యకర్తలు ఉన్నారని, సీఎం కేసీఆర్ సారథ్యంలో మంచి నాయకులు ఉన్నారన్నారు. వీరి ఆధ్వర్యంలో మళ్లీ సురక్షితమైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్పార్టీకి నూకలు చెల్లాయని, ఇప్పటి వరకు వారికి ప్రతి ఉపఎన్నికలో కనీసం డిపాజిట్ రాని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ఇంటింటికీ తీసుకెళ్లి వివరించాలని, అర్హులకు ఫలాలు అందేలా చూడాలని కోరారు. అనంతరం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన వేం వెంకటకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే, మండల ముఖ్యనాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుజాత, పీఏసీఎస్ చైర్మన్ చల్లా లింగారెడ్డి, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఖాసీం, జిల్లా నాయకులు భీరవెళ్లి వేణుగోపాల్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ముక్కా లక్ష్మణ్రావు, జిల్లా నాయకులు యశ్పాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, ఎంపీటీసీ రాధిక, ప్రసన్న, ఉపాధ్యక్షులు కాల్సాని వేణుమాధవ్రెడ్డి, కోడి రవి, నర్సింహ, అధికార ప్రతినిధి బానోత్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
పోడురైతుల జోలికి వెళ్లొద్దు..రైతులు అడవిని నరకవద్దు
ఫారెస్టు అధికారులు పోడు రైతుల జోలికి వెళ్లొద్దని, రైతుల కూడా కొత్తగా చెట్లను నరికి పోడు వ్యవసాయం చేయొద్దని ఎమ్మెల్యే శంకర్నాయక్ తెలిపారు. మండలంలోని బొల్లేపల్లిలో ఫారెస్టు అధికారులు, రైతులకు మధ్య శుక్రవారం వాగ్వాదం జరిగి మిరప మొక్కలు పీకేశారని వచ్చిన వార్తలకు స్పందించిన ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లి పంటలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోడు సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నా ఫారెస్టు అధికారులు పంటలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. రైతులు సైతం ఆడవులను నరకొద్దని, పర్యావరణానికి నష్టం కలిగించవద్దని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. ఫారెస్టు అధికారులతో మాట్లాడాలని విన్నవించారు.