కాజీపేట జంక్షన్ పరిధిలోని రైల్వే పాలిక్లినిక్ దవాఖాన రైల్వే సబ్ డివిజన్ దవాఖానగా ఉన్నతీకరిస్తున్నట్లు రైల్వే బోర్డు ఆదేశాలను జారీ చేసింది. అంతేగాక అభివృద్ధి చేసేందుకు ఏకంగా రెండున్నర కోట్ల నిధులకు మంజూరు ప్రకటించి, కార్మికుల నియమాకాల జారీ నోటిఫికేషన్కు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సమైక్య పాలనలో నిర్లక్ష్యం..
సమైక్య పాలనలో దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని తిరుపతి, కాజీపేట, విజయవాడ, గుంటూరు, నాందేడ్ రైల్వే దవాఖానలకు రైల్వే సబ్ డివిజన్గా దవాఖాలుగా మార్చింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం, అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకుల పట్టింపు లేని కారణంగా తుంగలో తొక్కి మిగితా అన్ని రైల్వే దవాఖానలను ఉన్నతీకరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సబ్ డివిజన్ స్థాయి కోసం రైల్వేశాఖ ఉన్నతాధికారులు, రైల్వేబోర్డుపై ఒత్తిడి పెంచారు. ఇటీవల ఎంపీ పసునూరి దయాకర్, రాష్ట ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితర నేతలు, జిల్లా అధికార యంత్రాంగం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలోని పలువురు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్లను పలు దఫాలుగా కలిసి.. ఉన్నతీకరణతో పాటు పలు సమస్యలపై చర్చించడంతో ఎట్టకేలకు సాధ్యమైంది.
కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధి
కాజీపేట రైల్వే జంక్షన్ ఉత్తర, దక్షిణ భారతావనికి ముఖద్వారంగా, సికింద్రాబాద్ రైల్వే డివిజన్లో రెండో అతి పెద్ద రైల్వే స్టేషన్గా పేరు గాంచింది. ఈ జంక్షన్ నుంచి బల్లార్ష సెక్షన్లో మాణిఘర్ వరకు, పెద్దపల్లి నుంచి ముత్కేడ్, నిజామాబాద్ వరకు, విజయవాడ సెక్షన్లో కొండపల్లి వరకు, డోర్నకల్ నుంచి మణుగూరు వరకు, అటు జగ్గయ్యపేట వరకు, సికింద్రాబాద్ సెక్షన్లో ఆలేరు వరకు కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధి ఉంటుంది. కేవలం కాజీపేట రైల్వే జంక్షన్లో వివిధ శాఖల్లో దాదాపు ఆరు వేల మంది కార్మికుల పనిచేస్తున్నారు. అలాగే కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో దాదాపు మరో 8వేల మంది కార్మికులు విధులను నిర్వర్తిస్తారు. ఈ పరిధిలో బెల్లంపల్లి, రామగుండం, డోర్నకల్, రైల్వేస్టేషన్ల పరిధిలోని చిన్నపాటి రైల్వే దవాఖానలను రైల్వే శాఖ గతంలోనే ఏర్పాటు చేశారు. ఈ దవాఖానలో నయం కాని రైల్వే రోగులను అక్కడి వైద్యులు కాజీపేటకు పాలీక్లినిక్కు పంపుతారు. ఇలా కాజీపేట రైల్వే దవాఖానలో కార్మికులు, కార్మిక కుటుంబాలు, విశ్రాంతి కార్మికులు, వారి కుటుంబాలు దాదాపు పదిహేను నుంచి 20వేల మంది వరకు వివిధ వైద్య సేవలు పొందుతారు.
టీఆర్ఎస్ నేతల ఒత్తిడితో..
ప్రస్తుతం రైల్వే దవాఖానలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేరని, వసతులు లేవని టీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వే ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచింది. దీంతో రైల్వే జీఎం, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాలతో సికింద్రాబాద్కు చెందిన రైల్వే వైద్య అధికారుల బృందం(సీఎంఎస్) చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో కాజీపేట పాల్లీకినిక్ను సందర్శించి తనిఖీలు చేశారు. స్థానికంగా రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు, పలువురి సూచనలు, సలహాలు తీసుకున్నారు. రైల్వే దవాఖాన పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ఆ వైద్య బృందం తప్పకుండా ఉన్నతీకరిస్తామని అభిప్రాయానికి వచ్చి రైల్వేబోర్డు కు నివేదికలను అందజేశారు. ఈమేరకు రైల్వే అధికారులు కాజీపేటలోని రైల్వే పాలీక్లినిక్ దవాఖానను సబ్ డివిజన్ హాస్పిటల్గా ఆధునీకరించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇలా కాజీపేట పాలీక్లినిక్కు సబ్ డివిజన్ స్థాయి దక్కడంతో కార్మిక వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఫలితంగా రైల్వేకార్మికులు, వారి కుటుంబాలు, విశ్రాంతి కార్మికులకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగనుంది.