“తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మూల పురుషుడు, సీఎం కేసీఆర్కు సాదర స్వాగతం పలికేందుకు వాసాలమర్రి ముస్తాబైంది. కష్టాల నుంచి విముక్తి కల్పించి పూలదారి వైపుగా పయనింపజేసేందుకు వస్తున్న అభివృద్ధి చాణక్యుడు పాదం మోపే క్షణాలను తలుచుకొని ఆనందంతో పరవశించిపోతున్నది. అంకాపూర్ తరహాలో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు ఊరి బాధ్యతను భుజానికెత్తుకోవడంతో ఉప్పొంగిపోతున్నది. వరాల మూట గట్టుకుని, తలరాతలు మార్చేందుకు వస్తున్న ఆ మహానేత రాకకోసం ఊరి జనం వేయికళ్లతో ఎదురుచూస్తున్నది. అభివృద్ధి ఆనవాళ్లను తమ కళ్లెదుట సాక్షాత్కరింపజేసేందుకు, సీఎం కేసీఆర్ నోటి పలుకులను వినేందుకు ఆసక్తితో వేచి చూస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. టూర్ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు సైతం శ్రమించారు. గ్రామస్తులతో కలిసి చేయనున్న సహపంక్తి భోజనం.. గ్రామ సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.”
గ్రామంలో పండుగ వాతావరణం..
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో వాసాలమర్రి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. వాసాలమర్రి అభివృద్ధికి గతేడాదే సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించడంతో జిల్లా యంత్రాంగం అందుకనుగుణంగా అన్ని చర్యలు చేపట్టింది. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రణాళికలను రూపొందించి సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను రాబోవురోజుల్లో చేపట్టనున్నారు. కమ్యూనిటీ హాళ్లు, ఇంటిగ్రేటెడ్ ఫంక్షన్ హాల్, దేవాలయాల ఆధునీకరణ, మినీ ట్యాంక్ బండ్ తదితర పనులన్నింటికీ సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం బీజం పడనున్నది. పక్కా ఇండ్ల నిర్మాణంతో పాటు వ్యక్తిగతంగా లబ్ధి కలిగించి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యాచరణ మొదలుకానున్నట్లు తెలుస్తున్నది. వెరసి వాసాలమర్రి రూపురేఖలు మారిపోనున్నాయి.
పటిష్ట బందోబస్తు, భారీ ఏర్పాట్లు…
వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పర్యవేక్షణలో యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అధికారులకు, గ్రామస్తులకు ప్రత్యేకంగా పాస్లను జారీ చేశారు. వేదికపై సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రమే కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండ్రోజులుగా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి 18ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు వేశారు.