America | అమెరికాలోని ఓరేగాన్ సిటీలో దారుణం జరిగింది. ఓ మహిళ 3 ఏండ్ల పసిపాపను రైలు పట్టాలపైకి తోసేశాడు. అప్రమత్తమైన ప్రయాణికులు.. ఆ పాపను రైలు పట్టాలపై నుంచి ప్లాట్ ఫామ్పైకి తీసుకొచ్చారు. తీవ్ర గాయాలపాలైన ఆ అమ్మాయిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 28వ తేదీన తన తల్లితో కలిసి మూడేండ్ల అమ్మాయి.. రైల్వే స్టేషన్లో నిల్చుంది. రైలు కోసం ఎదురుచూస్తుండగా, వెనుకాలే కూర్చున్న ఓ మహిళ ఆ పాపను పట్టాలపైకి తోసేసింది. బొక్కా బొర్లా పడ్డ ఆ అమ్మాయి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో రైలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని పట్టాలపైకి తోసేసిన ఆమె పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.