Tariffs | భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైన విషయం తెలిసిందే. టారిఫ్ల విషయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏప్రిల్ 2న తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ట్రంప్ విధించబోయే ప్రతీకార సుంకాల డెడ్లైన్ దగ్గరపడుతుండటంతో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ అంశంపై వైట్హౌస్ (White House) తాజాగా స్పందించింది.
ఈ మేరకు వైట్హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు (Tariffs) విధిస్తున్నట్లు తెలిపారు. భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాలు కూడా తమ ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీని వల్ల తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం కష్టతరమవుతోందని అన్నారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని.. అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పులు చేయబోతున్నారని వ్యాఖ్యానించారు.
‘పలు దేశాలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయి. అమెరికా పాల ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 50 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా బియ్యంపై జపాన్ 700 శాతం సుకం వసూలు చేస్తోంది. యూఎస్ బటర్, చీజ్పై కెనడా 300 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం టారిఫ్లు విధిస్తున్నాయి. వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు ఎగుమతి చేయడం కష్టతరంగా మారుతోంది. ఈ కారణంగా అమెరికన్ల వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సరైన సమయం. అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పులు చేయబోతున్నారు’ అని కరోలిన్ లీవిట్ వెల్లడించారు.
Also Read..
Sunita Williams: హిమాలయాలు అద్భుతం: సునీతా విలియమ్స్
NASA | బోయింగ్ స్టార్లైనర్లో మళ్లీ ప్రయాణానికి సిద్ధం.. ప్రకటించిన సునీతా విలియమ్స్..!
క్షిపణులను సిద్ధం చేస్తున్నాం.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్పందన