జెరుసలామ్ : ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. యూదులు వర్సెస్ అరబ్బుల జగడంగా మారింది. గత సోమవారం నుంచి ఆ దేశాల్లో జరుగుతున్న హింస ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నది. రంజాన్ వేళ ఆ రెండు దేశాలు రాకెట్లతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఇంతకీ తాజా హింసకు కారణం ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
అసలు ఏం జరుగుతోంది..
ఏప్రిల్ నుంచి జెరుసలామ్ వీధుల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాలు ఈ నగరాన్ని తమ రాజధానిగా భావిస్తాయి. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అల్ అక్సా మసీదు వద్ద ఆంక్షలు విధించారు. కేవలం 10 వేల మంది మాత్రమే ప్రార్థన చేసుకునేందుకు ఇజ్రాయిల్ అనుమతి ఇచ్చింది. ఇస్లాం ప్రకారం అల్ అక్సా మసీదు మూడవ పవిత్రమైంది. అయితే ఇదే ప్రాంతంలో యూదులకు చెందిన ఫస్ట్, సెకండ్ టెంపుల్స్ ఉన్నాయి. దీన్నే టెంపుల్ మౌంట్ అని కూడా అంటారు. రంజాన్ ప్రార్థనలకు వచ్చిన వేలాది మంది ముస్లింలను అల్ అక్సా మసీదు నుంచి తరిమేశారు. ప్రస్తుతం హింస ఇదొక కారణం అని చెప్పుకోవచ్చు.
ఇక షేక్ జారా జిల్లాలో జరిగిన అల్లర్లు కూడా మరో కారణంగా భావిస్తున్నారు. పాలస్తీనా కుటుంబాలను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల ఈ ఉద్రిక్తతలు ఉత్పన్నం అయినట్లు తెలుస్తోంది. యూద సెట్లర్ గ్రూపు ఒకటి.. కొంత భూభాగం కోసం పాలస్తీనా వాసులతో తగాదాకు దిగారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. దీంతో ఆ సమస్య ముదిరడం వల్లే .. రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభం అయినట్లు భావిస్తున్నారు. ఈ కేసులో ఇజ్రాయిల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఈయూ , యూఎన్, బ్రిటన్ ఖండించాయి.
ఈనెల 8వ తేదీన అల్ అక్సా మసీదు వల్ల వేలాది మంది ముస్లింలు ప్రార్థనలు కోసం వచ్చాయి. అయితే ఆ మసీదు కాంపౌండ్ గోడ వద్ద వెస్ట్రన్ వాల్ ఉన్నది. ఆ ప్రాంతంలో యూదులు పవిత్ర పూజలు చేస్తారు. ఇకప్పుడు ఇదే ప్రాంతంలో పవిత్ర టెంపుల్స్ ఉండేవని వారు భావిస్తారు. షేక్ జారా కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. భారీ సంఖ్యలో జనాలను అనుమతి ఇవ్వడం లేదని ఇజ్రాయిల్ పోలీసులు.. అల్ అక్సా మసీదు వద్ద ముస్లింలను అడ్డుకున్నారు. ఇక మే 10వ తేదీన.. జనాలను చెదరగొట్టేందుకు మసీద వద్ద ఇజ్రాయిల్ పోలీసులు సీఎస్ గ్యాస్, గ్రేనేడ్లను వాడారు. ఈ ఘటనతో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మళ్లీ పగ రాజుకున్నది.
ఈ ఘటనకు ప్రతీకారంగా హమాస్ .. గాజా నగరంలో నుంచి ఇజ్రాయిల్ మీదుకు రాకెట్ల వర్షం కురిపించింది. అల్ అక్సా మసీదు ఘటనను ఆ సంస్థ ఖండించింది. రాకెట్లు జెరుసలామ్ నగరం వైపుగా దూసుకువెళ్లినట్లు తెలుస్తోంది. పాలస్తీనా ఎన్నికలను జాప్యం చేసేందుకే హమాస్ వర్గం ఈ దాడులకు పాల్పడినట్లు విమర్శకులు ఆరోపించారు. అయితే గత సోమవారం నుంచి వరుసగా గాజా నుంచి హమాస్ తమ రాకెట్లతో దాడి చేస్తూనే ఉన్నది. దీంతో అరబ్బులు, యూదులు నివసించే నగరాల్లో ఉద్రిక్తత మొదలైంది. లాడ్ నగరంలో రెండు వర్గాలు భీకర ఘర్షణలకు పాల్పడ్డాయి. లాడ్ నగరంలో ప్రధాని నెతాన్యహూ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ నగరంలో ఉన్న యూద మందిరాలకు అరబ్ ముస్లింలు నిప్పుపెట్టారు. దానికి బదులుగా అరబ్ వాహనాలపై యూదులు దాడి చేశారు. దీంతో ఇజ్రాయిల్ మళ్లీ రక్తసిక్తమైంది.
ఇజ్రాయిల్లో 18 లక్షల మంది అరబ్బు ముస్లింలు ఉన్నారు. వారు అరబ్ లేదా పాలస్తీనా ఐడెంటిటీ కలిగి ఉన్నారు. వారికి ఇజ్రాయిల్ పౌరసత్వం కూడా ఉన్నది. ఇజ్రాయిల్ జనాభాలో అరబ్బులు 21 శాతం. ఇజ్రాయిల్ దేశంలోని అనేక నగరాల్లో యూదులు, అరబ్బులు .. పక్కపక్క కాలనీల్లోనే నివసిస్తూ ఉంటారు. అయితే పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయిల్ అరబ్బులు నిరసనలు చేపట్టడం అక్కడ ఆందోళనకరంగా మారింది.