Donald Trump : ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఆ దేశం మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో అనేక దేశాలకు ఈ జలసంధి నుంచి చమురు సహా పలు ఉత్పత్తుల రవాణా నిలిచిపోయింది. ఇండియా వంటి కొన్ని దేశాల నౌకలను మాత్రమే ఇరాన్ అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు, నౌకల రవాణా సజావుగా జరిగేందుకు ప్రపంచ దేశాలు తమ యుద్ధ నౌకల్ని పంపాలని ట్రంప్ కోరాడు.
హోర్ముజ్ జలసంధి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జల, సముద్ర రవాణాలో అత్యంత కీలకం. ఇక్కడి నుంచి అనేక దేశాలకు చమురు సహా ఆహారం, ఇతర ఉత్పత్తులు రవాణా అవుతుంటాయి. ఇది ఇరాన్ అధీనంలో ఉంటుంది. ఇప్పుడు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ మూసేసింది. నౌకల్ని కదలనీయడం లేదు. అలాగే, ఇక్కడి నౌకలపై ఇరాన్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. దీంతో ఈ మార్గంలో రవాణా నిలిచిపోవడంతో అనేక దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణా జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి రవాణా చేసే నౌకలకు అండగా తమ యుద్ధ నౌకలు వస్తాయని ట్రంప్ తెలిపాడు. అంతేకాదు.. ఈ జలసంధి మార్గంలో రవాణా సక్రమంగా జరిగేలా ప్రపంచ దేశాలు తమ యుద్ధ నౌకల్ని పంపాలని కూడా ట్రంప్ కోరాడు.
ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలు యుద్ధ నౌకల్ని పంపాలని విజ్ఞప్తి చేశాడు. మరోవైపు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంటున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై వివిధ దేశాలకు చెందిన చమురు నౌకల్ని అనుమతించాలని నిర్ణయించింది. అయితే, ఆ నౌక చైనా కరెన్సీ అయిన యువాన్లో ట్రేడింగ్ చేయాలని సూచించింది. అలాగే, ఇజ్రాయెల్, అమెరికా నౌకల్ని అనుమతించేది లేదని తెలిపింది.