వాషింగ్టన్: ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసే బుధవారంలోగా ఇరాన్ తమతో ఒక ఒప్పందానికి రాకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. అయితే పాక్లోని ఇస్లామాబాద్లో జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత నెలకొన్నది.
తమ ప్రతిపాదనలపై ఇరాన్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన ఇస్లామాబాద్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు సమాచారం. శాంతి చర్చలకు అమెరికా బృందానికి వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికాతో రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ దేశ అధికారిక సమ్మతి కోసం తాము ఇంకా వేచి చూస్తున్నామని పాకిస్థాన్ మంత్రి అత్తవుల్లా తరార్ మంగళవారం ప్రకటించారు.
ఇరాన్తో సీజ్ఫైర్ను పొడిగించనని ట్రంప్ స్పష్టం చేశారు ‘వారు కనుక శాంతి ఒప్పందం చేసుకుంటే తమను తాము బలమైన దేశంగా, అద్భుతమైన దేశంగా మరోసారి తీర్చిదిద్దుకోగలుగుతారు. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్తో అమెరికా ఒక గొప్ప ఒప్పందానికి వస్తుంది. వారికి ఇంకో అవకాశం లేదని నేను భావిస్తున్నానని’ ట్రంప్ తెలిపారు. రెండో విడత చర్చల నుంచి ఏం ఫలితాలు ఆశిస్తున్నారన్న మీడియా ప్రశ్నకు ‘మేం వారి నాయకులను తొలగించాం.
ఇది ఒక విధంగా పరిస్థితులను క్లిష్టతరం చేస్తున్నది. అయినా ఈ నాయకులు హేతుబద్ధంగా ఉన్నారు. మీరు దానిని ఏమని పిలిచినా అది పాలన మార్పే. నేను చేస్తానని చెప్పని పని ఇది. కానీ నేను దానిని పరోక్షంగా చేసి చూపించాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. తమపై బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో వారితో చర్చలకు అంగీకరించబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘాలిబాఫ్ స్పష్టం చేశారు.
అమెరికా సీజ్ చేసిన ఇరాన్కు చెందిన తౌస్కా అనే వాణిజ్య నౌకకు సంబంధించి ఐరాసలోని యూఎస్ మాజీ రాయబారి, రిపబ్లికన్ నేత నిక్కీ హేలి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నౌకలో క్షిపణి తయారీలో ఉపయోగించే రసాయనాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.