కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు బాంబు దాడులతో వణికిపోతున్నారు. కాబూల్ విమానాశ్రయంపై ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విమానాశ్రయం పరిసరాల్లో గుమికూడవద్దని సూచించింది. రెండు రోజుల క్రితం కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
గురువారం సాయంత్రం జరిగిన కాబూల్ దాడి మృతుల సంఖ్య 183కి చేరింది. ఇందులో అమెరికాకు రక్షణ దళాలకు చెందినవారు 13 మంది ఉండగా, 170 మంది ఆఫ్ఘన్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా, కాబూల్ దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.