ఉక్రెయిన్పై రష్యా దాడిలో ఒక అమెరికన్ పౌరుడు మరణించాడు. ఈ ఘటన చెర్నిహివ్లో జరిగినట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. ఇలా అమెరికన్ పౌరుడు మరణించిన విషయాన్ని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటనీ బ్లింకెన్ కూడా ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడి పేరు జిమ్మీ హిల్.
తన భార్య అనారోగ్యంతో ఉండటంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రిలోనే ఉండి. భార్యకు సేవలు చేస్తున్నాడతను. ఈ క్రమంలోనే కుటుంబానికి కావలసిన ఆహారం తదితర వస్తువులు తీసుకురావడానికి జిమ్మీనే బయటకు వెళ్లేవాడు. అలా వెళ్లి బ్రెడ్ కోసం ఒక చోట క్యూలో నిలుచుని ఉండగా.. రష్యా దళాలు జరిపిన కాల్పుల్లో జిమ్మీ దుర్మరణం పాలైనట్లు సమాచారం.
ఈ విషయాన్ని జిమ్మీ సోదరి చెరీల్ హిల్ గోర్డాన్ తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించింది. ఈ విషయంపై చెర్నిహివ్ పోలీసు విభాగం కూడా స్పందించింది. రష్యా దాడిలో ఒక అమెరికన్ పౌరుడు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. స్థానికంగా రష్యా దాడిలో జరుగుతున్న గోరాలను జిమ్మీ తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకుంటూ వచ్చాడు.
చివరగా చేసిన ఒక పోస్టులో.. ‘‘భయంకరమైన బాంబింగ్ జరుగుతోంది. ఆహారం పరిమితంగానే ఉంది. ఇళ్లు కూడా చాలా చల్లగా మారిపోయాయి’’ అని జిమ్మీ చెప్పుకొచ్చాడు. కీవ్, వార్సా ప్రాంతాల్లోని పలు యూనివర్సిటీల్లో చదువు చెప్పుకుంటూ జిమ్మీ జీవనం సాగించేవాడని తెలుస్తోంది.