ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు రోజురోజుకూ ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక మెటర్నిటీ ఆస్పత్రిపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వీటిని యుద్ధ నేరాలుగా పరిగణించాలని చెప్పారు. అయితే తాము ఆస్పత్రిపై దాడి చేయలేదని రష్యా వర్గాలు తెలిపాయి. దీనిపై తాజాగా స్పందించిన రష్యా ప్రభుత్వం.. ఈ దాడి గురించి మిలటరీ అధికారులను సంప్రదించి వివరాలు సేకరిస్తామని తెలిపింది.
ఉక్రెయిన్లోని మారిపోల్లో ఈ దాడి జరిగింది. దీనిపై రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ దీనిపై మాట్లాడారు. ‘‘ఈ దాడి గురించి కచ్చితంగా మా మిలటరీని ప్రశ్నిస్తాం. ప్రస్తుతానికైతే అక్కడ ఏం జరిగిందనే విషయంలో మా వద్ద సరైన సమాచారం లేదు. అయితే దీనిపై ఎంతో కొంత సమాచారమైతే మిలటరీ నుంచి తప్పకుండా వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.