ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న అంశం ఉక్రెయిన్-రష్యా యుద్ధం. ఈ రెండు దేశాల మధ్య పలు దశల్లో చర్చలు జరిగినా ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ప్రస్తుతం ఈ రెండు దేశాలు కీలకమైన అంశాల్లో ఒప్పందానికి చేరువగా ఉన్నాయని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కావుసోగ్లు చెప్పారు.
ఇరుదేశాల నేతలు ఇప్పటి వరకు అంగీకరించిన అంశాలపై వెనకడుగు వేయకపోతే త్వరలోనే రెండు వైపుల నుంచి కాల్పుల విరమణ జరుగుతుందని ఆయన అన్నారు. తాజాగా ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘‘కొన్ని కీలకమైన, ముఖ్యమైన అంశాలపై ఇరువర్గాలు కొంతమేర అంగీకారానికి వచ్చాయి’’ అని చెప్పారు.
ఉక్రెయిన్ ముందు రష్యా ఉంచిన నాలుగు డిమాండ్ల విషయంలో రెండు దేశాలు కొంత ప్రగతి సాధించాయని టర్కీ అధ్యక్షుడి ప్రతినిధి ఇబ్రహీం కాలిన్ మరో ఇంటర్వ్యూలో చెప్పారు. నాటోలో ఉక్రెయిన్ చేరకుండానే.. ఆ దేశ రక్షణకు భంగం కలగని విధానంపై గతవారమే రష్యా, ఉక్రెయిన్ చర్చలు జరిపాయి. అయితే ఈ విషయంలో ముందుకు వెళ్లకుండా ఆపుతున్నారంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రెండు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న టర్కీ.. ఈ యుద్ధం ముగిసే సూచనలు దగ్గరలోనే ఉన్నాయని చెప్పడం శుభపరిణామమే.